
‘ఎగిరెగిరి దంచినోడికి అదే కూలి.. ఎగరకుండా దంచినోడికి అదే కూలి’ అన్నట్లు ఎసిలో కూర్చునోళ్లకు అదే కూలి. ఎండనక, వాననకా, రాత్రనక, పగలనక కరెంటు కోసం చెట్లు పుట్టలు ఎక్కెటోళ్లకు అదే కూలి, కాదు అంతకన్నా తక్కువ కూలీ అదేంది అనుకుంటున్నారా ఇది నిజం. కింద కూసోని పని చెప్పేటోళ్లకు పైసలెక్కువ, అదే కరెంటు స్తంభాలెక్కి పనిచేసే కార్మికులకు తక్కువ జీతం, ఎక్కువ శ్రమ, గ్యారెంటీలేని జీవితం ఎప్పుడు ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి ఇన్ని ఇబ్బందులను తట్టుకొని కూడా శ్రమిస్తున్నారంటే నిజానికి కరెంటు కార్మికులకు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పది నిమిషాలు కరెంటు పోతే మనం అల్లాడిపోతం, అంతేకాదు మనం 12 గంటలు డ్యూటీ చేస్తేనే అయోమయం అయిపోతాం. మరి అలాంటిది కరెంటు కార్మికుల పరిస్థితి ఎప్పుడైనా చూశారా? మన దేశంలో ఎక్కువ కష్టపడేది ఎవరంటే మొదటగా సైనికులు, ఆ తర్వాత పోలీసులు, కరెంటు కార్మికులు కూడా అత్యధికంగా శ్రమించేవారే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఎండైనా, వానైనా, రాత్రైనా ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్ స్తంభాలెక్కి పని చేయడం చిన్న విషయం కాదు. ఒక్క చిన్న తప్పిదం జరిగినా ప్రాణానికి ముప్పు. అయినా కూడా వాళ్లు పనిచేస్తూనే ఉంటారు, ఎందుకంటే సమాజం నడవడానికి వాళ్ళు చేయడం ఎంతో అవసరం లేదంటే అంత చీకటిమయం. మరి అంత శ్రమించేవారికి జీతం ఎందుకు తక్కువ అనుకుంటున్నారా అదే మరి సమస్య ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ‘ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదట విసిరేసేది అప్పటివరకు సహాయపడిన చేతికర్రనే’ అన్నట్లు ఓడిపోయినా నాయకులకు, గెలిచినా నాయకులకు కరెంటు కార్మికులు చేతికర్రలాంటోళ్ళు వాళ్ళకి పదవి రాగానే కరెంటు కార్మికులను కంటికి కనపడకుండా తిరుగుతారు. అప్పటిదాకా మేము ఉన్నాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నోళ్లే ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితి. ఈ కార్మికుల కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాక కకావికలం అవుతున్నారు.
కెసిఆర్ ప్రభుత్వం పర్మినెంట్ చేస్తాం అనగానే కార్మికులకు ఇక మాకు మంచిరోజులు వచ్చినాయి అనుకుండ్రు. తీరా చూస్తే మళ్ళీ మొదటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత హోదా కల్పించమని ఏండ్లతరబడి మొత్తుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఇగ చేస్తాం అగ చేస్తాం అని చెప్పుడే తప్ప చేసింది ఏమీలేదు. గత 18 ఏళ్లకు పైగా తెలంగాణ విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా సేవలందిస్తున్నవారు అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో, వీరి సేవలను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో, 2016లో విద్యుత్ కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. నిరసన కారణంగా జులై 28, 2017న పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 12(3) ప్రకారం ఒప్పందం కుదిరింది. జులై 29, 2017న సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇంతవరకు చూస్తే సమస్య పరిష్కారం దిశగా వెళ్లినట్టే కనిపించింది. అయితే, ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ కొందరు నిరుద్యోగ యువకులు దీనిని హైకోర్టులో సవాలు చేసి నీరుగార్చేలా చేశారు. సెప్టెంబర్ 18, 2018న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పునిస్తూ, సెక్షన్ 12(3) ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించుకునే అధికారం విద్యుత్ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక సంఘలకు ఉందని స్పష్టం చేసింది. అప్పటి సిఎం అసెంబ్లీలో, గవర్నర్ ప్రసంగం ద్వారా 23,667 మంది కార్మికులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించారు. కానీ కార్మికుల రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతూ కార్మికులకు పూర్తిస్థాయి క్రమబద్ధీకరణకు బదులుగా, పాత ఉత్తర్వులను రద్దు చేసి, ఫ్యాక్టరీల చట్టం 1946 స్టాండింగ్ ఆర్డర్స్ సర్వీస్ రూల్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల అధికారికంగా శాశ్వత హోదా లేకుండానే కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. ‘చెప్పుకొని మురువుచూసుకొని ఏడువు’ అన్నట్లు వీరు సమాజం దృష్టిలో శాశ్వత ఉద్యోగులే కానీ, ప్రభుత్వ దృష్టిలో మాత్రం కాదు.
చెప్పుకోవడానికి కరెంటు ఉద్యోగం కానీ వీరి జీవితం కన్నీళ్లు కష్టాలే. జీతం పెంచుడు దేవుడెరుగు కానీ మా కష్టాలను చూసైనా కనికరించండయ్యా మహా ప్రభో అని వేడుకున్న వినే నాయకులు లేరు. ఇక పని విషయానికి వస్తే.. ఎంత చెప్పుకున్నా వీరి కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరి పని నలుగురు చేస్తుంటే, కరెంట్ ఆఫీసుల్లో మాత్రం ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరు ముగ్గురే మోస్తున్నారు. సమాన అవకాశాలు లేకపోవడమే కాదు.. గత రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ అయిన వాళ్లకి, రెగ్యులర్ కాని వాళ్లకి 30% నుంచి 60% వరకు జీతాల్లో తేడా ఉంది. సాధారణంగా ఏడాదికి 300 షిఫ్టులు ఉండాలి.. కానీ వీరు 450 షిఫ్టులు చేస్తున్నారు. వారానికి సెలవులు కూడా లేకుండా, నిరంతరం పని ఒత్తిడిలోనే బతుకుతున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే.. తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకి కూడా వెళ్లలేని పరిస్థితి.. అంత్యక్రియలకు హాజరు కాలేని బాధ.. మాటల్లో చెప్పలేం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆర్టిసన్ కార్మికులకి ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ లేవు.. గ్రాట్యుటీ అనే హక్కు కూడా లేదు. దాంతో రిటైర్ అయ్యాక కూడా బతుకుదెరువు కోసం మళ్లీ వృద్ధాప్యంలో అడ్డా కూలీలాగా తిరగాల్సిన పరిస్థితి నిబంధనల ప్రకారం గ్రేడ్ మార్చితే ప్రభుత్వానికి నెలకు 10 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారు.
కానీ మేమేమీ అదనంగా అడగడం లేదు సార్.. ఇప్పుడు తీసుకుంటున్న జీతాలకే (కరెంట్ పే స్కేల్కి) మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకోండి అనేదే మా విజ్ఞప్తి. ప్రభుత్వంపై భారం లేకుండా, మా బతుకుల్ని గాడిలో పెట్టాలనే మా కోరిక మాత్రమే.. అంతే అని అంతలా వేడుకున్నా కూడా ప్రభుత్వం కరుణించకపోవడం.. ఇది మాత్రం కరెంట్ కార్మికుల దౌర్భాగ్యమే అనాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే.. విధి నిర్వహణలోనే ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మా ఆర్టిసన్ కార్మికుల్లో B.Tech, డిప్లొమా, పిజిలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయినా సరే వారికి సరైన కేడర్ లేకుండా, గౌరవం లేకుండా పని చేస్తున్నారు. వారిని కూడా గౌరవించి, సమాలోచన చేసి, తగిన చర్యలు తీసుకోవాలని, కనీసం మాకు ప్రభుత్వం పాత సర్వీస్ రూల్స్ అమలు చేసి, మా జీవితాల్లో వెలుగులు నింపండని ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
– కోట దామోదర్
93914 80475