Reading Time: 2 minutes
మహిళా రిజర్వేషన్లు రాజకీయ లబ్ధి కోసం కాదు.. మహిళా సాధికారత కోసమే: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

మహిళా రిజర్వేషన్ల అంశం కేవలం రాజకీయ క్రెడిట్ కోసం కాదని, అది భారతీయ మహిళల గౌరవానికి, ప్రాతినిధ్యానికి, వారి హక్కులకు సంబంధించిన అంశమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పదేపదే చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడుతూ, దేశ మహిళలకు ఇప్పుడు కావలసింది ఆచరణాత్మక ఫలితాలే తప్ప, అమలుకు నోచుకోని వాగ్దానాలు కావని హితవు పలికారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ డిమాండ్ వల్ల రాలేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పం వల్లే సాధ్యమైందని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. గత 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని చర్చలకే పరిమితం చేయకుండా, 106వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామని ఆయన వివరించారు. ఇది కేవలం ప్రతిపాదన కాదని, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.

రిజర్వేషన్ల అమలుపై ప్రతిపక్షాల ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు. తదుపరి జనాభా గణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో(డిలిమిటేషన్) మహిళా రిజర్వేషన్ల అమలు ముడిపడి ఉందని తెలిపారు. ఇది రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన విషయం కాదని, దేశంలోని ఫెడరల్ బ్యాలెన్స్‌ను కాపాడటానికి, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి తీసుకున్న రాజ్యాంగ నిర్ణయమని వివరించారు. 2029 సాధారణ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గాల సంఖ్యను పెంచే క్రమంలో జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రం గొంతు నొక్కకుండా, మహిళలకు అర్థవంతమైన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సంస్కరణ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా మహిళా సాధికారతపై చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో ఈ చారిత్రాత్మక సంస్కరణ అమలుకు సహకరించాలని ఆయన కోరారు. అనవసర జాప్యం చేయకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని సూచించారు. దేశ మహిళలు ఫలితాలను కోరుకుంటున్నారని, కాలయాపనను కాదని ఆయన తెలిపారు.