
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేస్తామన్నారు. ఇక సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా త్వరగా రిలీజ్ చేస్తామని, రైతులు వీటి కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
ధరణి స్థానంలో భూభారతి పోర్టల్
ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది రైతులు తమ భూమిని కోల్పోయారని, అందులో ఎన్నో లోసుగులు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక అందులోని సమస్యలను పరిష్కరించామన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత తెచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకోమన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేలు చొప్పున అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవలే రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేశామని, ఈ నెలాఖరుల్లోగా అన్ని ఎకరాలకు అందిస్తామని పొంగులేటి చెప్పారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్
తమ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్న పొంగులేటి.. ఎవరికి భయపడమని అన్నారు. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. సన్న వడ్లను రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నామని, ఇతర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాల అవాకులు, చెవాకులు తాము పట్టించుకోమని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమకు అంటిన బురదను తమకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ ముందుకెళ్తుందని పొంగులేటి తెలిపారు.