Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi : వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు పనులు పక్కన పెట్టిన పొలిటికల్ లీడర్స్.. మనోడి విధ్వంసానికి ఫిదా

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం మామూలుగా లేదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ బీహార్ కుర్రాడికి ఇప్పుడు అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వైభవ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాధారణంగా తన కఠినమైన ఇంగ్లీష్ పదజాలంతో వార్తల్లో నిలిచే శశి థరూర్, ఈసారి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ముగ్ధులయ్యారు. వైభవ్ అవుట్ అయిన వెంటనే ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “ఆ! వైభవ్ అవుట్ అయ్యాడు, కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఇక నేను నా పనుల మీద దృష్టి పెట్టవచ్చు, అంటే ట్వీట్ చేయడం లాంటివి!” అని సరదాగా పేర్కొన్నారు. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు తానూ ఏ పని చేయలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

15 ఏళ్ల ఈ కుర్రాడు క్రికెట్ ఆట పరిణామ క్రమంలోనే ఒక మాస్టర్ క్లాస్ అని థరూర్ కొనియాడారు. వైభవ్ జనరేట్ చేస్తున్న బ్యాట్ స్పీడ్, అతని టైమింగ్ చూస్తుంటే తనకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతోందని ఆయన అన్నారు. వైభవ్ కేవలం క్రికెట్ ఆడటం లేదు, కొత్త తరం కోసం బ్యాటింగ్ నిర్వచనాన్ని మారుస్తున్నాడని 70 ఏళ్ల థరూర్ ప్రశంసించారు. ఒక అరుదైన, తరానికి ఒక్కడు పుట్టే ప్రతిభను మనం కళ్లారా చూస్తున్నామని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.

రాజస్థాన్ ఘనవిజయం

ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్, అందులో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ వంటి సీనియర్ బౌలర్లను నెట్ బౌలర్ల కంటే హీనంగా ఆడుకున్నాడు. యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయినా, ధ్రువ్ జురెల్ (81 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం

ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ తన టీమ్ మేట్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ రేసులో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వైభవ్ 4 మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేయగా, జైస్వాల్ 183 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 15 ఏళ్ల వయసులో ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లో ఇలాంటి ప్రదర్శన చేయడం నిజంగా ఒక అద్భుతం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..