Reading Time: < 1 minute

దేశంలో ఆరు దశాబ్దాల క్రితం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, కేంద్ర ప్రభుత్వం ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025’ను అమల్లోకి తెచ్చింది. ఈ నూతన సంస్కరణలపై ప్రజల్లో, ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన పెంచేందుకు ఐటీ విభాగం ‘మైగవ్’ (MyGov) పోర్టల్‌తో కలిసి ఒక వినూత్న క్విజ్ పోటీని నిర్వహిస్తోంది.

దీనిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీ మార్చి 20, 2025న ప్రారంభమైంది. ఏప్రిల్ 20, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 300 సెకన్ల వ్యవధిలో పూర్తి చేయాలి. నెగెటివ్ మార్కులు ఉండవు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ నగదు బహుమతులు ఉంటాయి. మొదటి 10 మందికి రూ.10,000 చొప్పున అందిస్తారు. ఆ తర్వాత ప్రతిభ చూపిన 20 మందికి రూ. 5,000 చొప్పున.. మరో 50 మందికి రూ.3,000 చొప్పున నగదు అందుతుంది. అంతే కాకుండా.. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఇ-సర్టిఫికెట్ లభిస్తుంది.

Also Read:AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

పాల్గొనే విధానం..
ఆసక్తి గల వారు MyGov పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, క్విజ్ విభాగంలో ‘Income Tax Act 2025’ పోటీని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానాలు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పన్ను వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వం నుంచి నగదు పురస్కారం పొందేందుకు ఇది ఒక చక్కని అవకాశం. ప్రాంతీయ భాషల్లో అనువాద సమస్యలు ఉంటే ఆంగ్ల భాషా ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటారు.