
టీడీపీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. శనివారం ( ఏప్రిల్ 11 ) అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇంఛార్జ్లతో సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం-అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు చంద్రబాబు.
క్షేత్ర స్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు చంద్రబాబు. సోలార్ రూఫ్ టాప్ వినియోగంపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.
స్వయంగా తామే సోలార్ రూఫ్ టాప్ వినియోగిస్తున్నామని… విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని తెలిపారు పలువురు కార్యకర్తలు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించడం ఈనాటిది కాదని… ఎన్టీఆర్ హయాం నుంచి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ద్వారా క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నామని.. క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నామని అన్నారు. క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్సుగా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు చంద్రబాబు.
నాడు ఐటీతో హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్టే నేడు క్వాంటంతో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. క్వాంటం కంప్యూటర్ పెట్టాలని మనం అనుకుంటే, ఆ కంప్యూటర్లు తయారు చేసేందుకు సంస్థలు ముందుకొచ్చాయని అన్నారు.ఏప్రిల్ 14న క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించనున్నామని అన్నారు.