
అస్సాంలోని బర్సాపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్కు వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఆరంభమైంది. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఏమాత్రం తడబడలేదు. ప్రారంభంలో రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోహ్లీ, ఆ తర్వాత మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించే దిశగా సాగాడు.
బిష్ణోయ్ మాయాజాలం.. కోహ్లీ నిష్క్రమణ..
కోహ్లీ జోరు చూస్తుంటే భారీ స్కోరు ఖాయమనిపించింది. ఈ దశలో రాజస్థాన్ కెప్టెన్ స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఐదవ ఓవర్ వేయడానికి వచ్చిన రవి బిష్ణోయ్ తన ఐదవ బంతికి అద్భుతం చేశాడు. ఒక అద్భుతమైన గూగ్లీతో కోహ్లీని పూర్తిగా తికమక పెట్టాడు. బిష్ణోయ్ విసిరిన ఆ బంతిని అంచనా వేయడంలో విఫలమైన విరాట్, క్రీజు వదిలి ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ వంటి మేటి బ్యాటర్ను అంత సులువుగా అవుట్ చేయడంతో బిష్ణోయ్ ఆనందానికి అవధులు లేవు. సింహంలా గర్జిస్తూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.
నిశ్శబ్దమైన స్టేడియం..
Ravi Bishnoi gets the big man pic.twitter.com/XUxogzlngN
— Nickk Knight (@KnightNick34590) April 10, 2026
విరాట్ కోహ్లీ వికెట్ పడగానే స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వేల సంఖ్యలో బెంగళూరు జెర్సీలు ధరించి వచ్చిన అభిమానులు కోహ్లీ అవుట్ కావడంతో నిరాశకు గురయ్యారు. అదే సమయంలో రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ స్థానిక అభిమానులను ఉత్సాహపరుస్తూ తన జట్టుకు మద్దతు తెలపాలని కోరడం విశేషం. కోహ్లీ అవుట్ అయిన తీరు చూసి క్రీడా విశ్లేషకులు సైతం బిష్ణోయ్ నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..