
ఈజిప్టులో జరిగిన తాజా పురావస్తు తవ్వకాలు ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుమారు 3,000 ఏళ్ల నాటి ప్రాచీన రహస్యాలను మోసుకొస్తున్న ఎనిమిది అరుదైన పాపైరస్ స్క్రోల్స్ (పత్రాలు) బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమైన ఆవిష్కరణ..
ఈజిప్టు పర్యాటక , పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సర్లోని క్వర్నా ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిగాయి. అక్కడ ‘సెనెబ్’ సమాధికి సమీపంలో ఒక మట్టి పాత్రలో భద్రపరిచిన ఎనిమిది పురాతన పత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో కొన్నింటికి 3,000 ఏళ్ల నాటి ఒరిజినల్ మట్టి ముద్రలు అలాగే ఉండటం విశేషం.

స్క్రోల్స్తో పాటు, రాతితో చెక్కిన ఒక గదిలో రంగురంగుల శవపేటికల గుంపు కూడా లభించింది. ఇవి ‘ఆమున్’ అనే దేవుడి ఆలయంలో పాటలు పాడే గాయనీమణులకు చెందినవని గుర్తించారు. ఈ గదిలో స్థలాన్ని ఆదా చేయడానికి, శవపేటికల మూతలను వేరు చేసి ఒకదానిపై ఒకటి 10 వరుసలలో పేర్చడం పరిశోధకులను విస్మయానికి గురిచేసింది.
Also Read:Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్ప్రెస్లు రద్దు..
పరిరక్షణ చర్యలు..
చాలా కాలం భూమిలో ఉండటం వల్ల శవపేటికల చెక్క కొంత దెబ్బతిన్నప్పటికీ.. నిపుణులు వాటిపై ఉన్న రంగులు చెడిపోకుండా జాగ్రత్తగా శుభ్రం చేస్తున్నారు. ఈ శవపేటికలపై వ్యక్తుల పేర్లకు బదులుగా వారి పదవులు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఆ కాలంలోని సంగీత విద్వాంసుల జీవనశైలి గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.

చారిత్రక ప్రాధాన్యత..
ఈ పత్రాలు క్రీస్తుపూర్వం 1070 నుంచి 664 మధ్య కాలానికి చెందినవి. వీటిని పూర్తిగా చదివితే ఆ కాలం నాటి విశేషాలు బయటపడతాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కూడా ఇటువంటి పరిశోధనలకు పూర్తి మద్దతు ఇస్తోంది. ఇటీవలె క్లియోపాత్రా ప్యాలెస్ సమీపంలో ఒక విలాసవంతమైన పడవ, అలాగే బైబిల్లో పేర్కొన్న సైనిక రహదారి వద్ద ఒక పురాతన కోట కూడా బయటపడటం విశేషం. ఈ కొత్త ఆవిష్కరణలు ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు.