
చెన్నై: టీ20 వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ (56 బాల్స్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 నాటౌట్) ఫామ్లోకి వచ్చి సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో ఐపీఎల్లో మూడు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 23 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. శాంసన్ విధ్వంసకర సెంచరీకి తోడు యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే ( 36 బాల్స్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) ఫిఫ్టీతో మెరవడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 212/2 స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 189 రన్స్కు ఆలౌటైంది.
ట్రిస్టన్ స్టబ్స్ (38 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), పాథుమ్ నిశాంక (24 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. జేమీ ఓవర్టన్ (4/18), అన్షుల్ కాంబోజ్ (3/35) ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఛేజింగ్లో ఓపెనర్లు నిశాంక, కేఎల్ రాహుల్ (18) తొలి వికెట్కు 61 రన్స్ జోడించి మంచి పునాది వేసినా తర్వాత ఢిల్లీ తడబడింది.
15 రన్స్ తేడాతో ఓపెనర్లతో పాటు అక్షర్ పటేల్ (1), సమీర్ రిజ్వీ (1) వికెట్లు కోల్పోయి డీలా పడింది. మిల్లర్ (17), అశుతోష్ శర్మ (19) సపోర్ట్తో స్టబ్స్ పోరాడినా.. మరో ఎండ్లో సీఎస్కే బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
శాంసన్ ధమాకా
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టుకు శాంసన్ వెన్నెముకగా నిలిచాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మార్కు క్లాసిక్ షాట్లతో ఢిల్లీ బౌలర్లను ఉతికేస్తూ ఈ సీజన్లో తొలి సెంచరీతో రికార్డుకెక్కాడు. కెప్టెన్, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (15) ఇబ్బంది పడినా శాంసన్ మాత్రం ఆరంభం నుంచే వరుస షాట్లతో విజృంభించాడు. పేసర్ ముకేశ్ బౌలింగ్లో వరుసగా రెండేసి ఫోర్లు కొట్టిన అతను స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన సిక్స్ తన ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది.
తొలి వికెట్కు 62 రన్స్ జోడించి న తర్వాత గైక్వాడ్ ఔటవగా.. ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ ఆయుష్ మాత్రేతో కలిసి సంజూ తన జోరు కొనసాగిస్తూ 26 బాల్స్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 55 రన్స్ వద్ద అక్షర్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను పాథుమ్ నిశాంక డ్రాప్ చేయడంతో వచ్చిన చాన్స్ను శాంసన్ సద్వినియోగం చేసుకున్నాడు. మరో ఎండ్లో మాత్రే సైతం పవర్ ఫుల్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లు రాబట్టి 27 బాల్స్లో ఫిఫ్టీ అందుకున్నాడు.
చివర్లో శివమ్ దూబే (20 నాటౌట్)కు అవకాశం ఇచ్చేందుకు మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరగడంతో రెండో వికెట్కు 113 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. నటరాజన్ బౌలింగ్లో వరుస ఫోర్లతో 52 బాల్స్లోనే శాంసన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. లాస్ట్ ఓవర్లో దూబే 6, 4తో సీఎస్కే స్కోరు 210 దాటింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 212/2 (శాంసన్ 115 నాటౌట్, మాత్రే 53, అక్షర్ 1/39).
ఢిల్లీ: 20 ఓవర్లలో 189 ఆలౌట్ (స్టబ్స్ 60, నిశాంక 41, ఓవర్టన్ 4/18, అన్షుల్ 3/35)