Reading Time: 2 minutes
ఏం జరగనుంది..? పాకిస్తాన్‌లో అమెరికా – ఇరాన్‌ చర్చలు.. ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఫైర్..

పాకిస్తాన్‌లో అమెరికా – ఇరాన్‌ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరాన్‌ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌లో ల్యాండైంది. ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మొహమ్మద్‌ బగేర్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చితోపాటు మరికొందరు పాకిస్తాన్ లో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పాక్ కు వచ్చిన ఇరాన్‌ బృందానికి పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్వాగతం పలికారు. అయితే.. ఇరాన్ తో చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం ఇప్పటికే అమెరికా నుంచి బయల్దేరింది. ఇరాన్‌ ప్రతినిధులు వచ్చిన విమానంలో స్కూల్‌ ఎటాక్‌లో చనిపోయిన బాలికల ఫొటోలు ఉంచారు. వారు కూడా తమ ప్రతినిధులేనని.. ఇరాన్‌ పేర్కొంది.. ఇదిలాఉంటే.. చర్చలకు ఇజ్రాయెల్‌, లెబనాన్‌ దేశాలు దూరంగా ఉన్నాయి.

కుదిరితే చారిత్రక ఒప్పందం, లేకపోతే వరల్డ్‌ వార్‌కు దారి తీయనుందా? అనేది.. ఇస్లామాబాద్‌ చర్చలు అత్యంత కీలకంగా మారాయి. 15 పాయింట్ల అజెండాతో అమెరికా ముందుకొచ్చింది. అంతకు మించిన పాయింట్లతో ఇరాన్‌ చర్చలకు సిద్ధమైంది. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తేయాలి.. జలసంధిపై సార్వభౌమాధికారం కావాలంటున్న ఇరాన్‌.. 10-సూత్రాల అజెండాపై వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ.. ఓడలపై పన్నులు విధింపు, అమెరికా పశ్చిమ ఆసియాను విడిచిపెట్టాలి.. ఇంకా ముఖ్యమైన షరతు ఏమిటంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగేంత వరకు ఒప్పందం కుదరదు.. అంటూ తేల్చి చెప్పింది.

ప్రాక్సీ గ్రూపులను విడనాడాలంటూ.. ట్రంప్ 15-సూత్రాల ప్రతిపాదన చేసింది.. మొదటి షరతు ఏమిటంటే, ఇరాన్ యురేనియం మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది.. ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేసి, తన మిత్రదేశాల నుండి అందుకుంటున్న సహాయాన్ని వదులుకోవాలని పేర్కొంది.. అణ్వాయుధాలు విడనాడాలి, జలసంధిని తెరవాలంటున్న అమెరికా డిమాండ్లపై ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

అమెరికా తరఫున జారెడ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చల్లో పాల్గొంటారు. ఇరాన్ నుంచి అత్యంత అనుభవజ్ఞులైన దౌత్యవేత్తలైన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఖిర్ ఖాలిబాఫ్‌ పాల్గొంటారు.. పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ స్వయంగా ఈ ప్రతినిధి బృందం భద్రతా వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు. అందుకే నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది.

ఇజ్రాయెల్‌-పాకిస్తాన్‌ మధ్య పంచాయితీ..

ఇరాన్‌-అమెరికా చర్చల వేళ ఇజ్రాయెల్‌-పాకిస్తాన్‌ మధ్య పంచాయితీ ముదిరింది.. ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ తీవ్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గాజా, ఇరాన్‌, లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్‌ చంపేస్తోంది.. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌గా అభివర్ణించిన ఖవాజా ఆసిఫ్‌.. పాలస్తీనా గడ్డపై ఉన్న ఇజ్రాయెల్‌ నరకంలో తగలబడిపోవాలంటూ వ్యాఖ్యానించారు. మానవాళి పాలిట ఇజ్రాయెల్‌ ఒక దుష్టశక్తి అనీ, శాపమన్న పాక్‌ మంత్రి వ్యాఖ్యలపై.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. తమ దేశ నాశనాన్ని పాక్‌ కోరుకోవడం దారుణమన్న నెతన్యాహు.. ఈ ప్రకటనను ఏ దేశం కూడా సహించలేదన్నారు. ముఖ్యంగా శాంతి చర్చలకు తటస్థ మధ్యవర్తి అని చెప్పుకుంటున్న. పాక్‌ నుంచి ఇలాంటి ప్రకటనను మేం భరించలేం అంటూ నెతన్యాహు ఫైర్ అయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..