Reading Time: < 1 minute
ఇది ఏప్రిల్‌ బాబు.. మీ వెల్త్‌ను రీసెట్‌ చేసుకోవాల్సిన టైమ్‌! ఎలాగంటే?

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను పునఃసమీక్షించుకోవడానికి ఉత్తమ సమయంగా మారుతోంది. జీతాల సవరణలు, బోనస్‌లు, పన్ను నిబంధనల్లో మార్పులు కలిసి ఈ సమయంలో వ్యక్తులకు తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులపై స్పష్టమైన అవగాహనను కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక నిపుణుడు శుభమ్‌ గుప్తా అభిప్రాయం ప్రకారం ఏప్రిల్‌లో వచ్చే మార్పులు వ్యక్తుల ఆర్థిక స్థితిని అంచనా వేసుకోవడానికి సహజమైన అవకాశం ఇస్తాయి. అయితే ఈ రీసెట్ కేవలం క్యాలెండర్‌కే పరిమితం కాకుండా, జీవితంలో వచ్చే మార్పులతో అనుసంధానించుకోవాల్సిన అవసరం ఉందని సౌరభ్ బన్సల్ సూచిస్తున్నారు.

జీతం పెరిగిన తర్వాత ఎక్కువ మంది చేసే సాధారణ తప్పు జీవనశైలిని వెంటనే పెంచుకోవడం. కానీ నిపుణులు మాత్రం ముందుగా పెట్టుబడులను పెంచాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లను ఆదాయానికి అనుగుణంగా సవరించడం దీర్ఘకాలికంగా మంచి లాభాలను ఇస్తుందని చెబుతున్నారు. ప్రతి ఏడాది లేదా ఆదాయం పెరిగినప్పుడు SIPలను పెంచుకోవడం మంచి ఆర్థిక అలవాటుగా మారుతుంది.

పన్ను ప్రణాళిక విషయంలో కూడా ముందుగానే చర్యలు తీసుకోవడం అవసరం. చాలామంది మార్చి నెలలో హడావుడిగా పెట్టుబడులు పెట్టడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఏప్రిల్ నుంచే పన్ను ప్రణాళిక ప్రారంభిస్తే, ఆలోచనాత్మకంగా, సరైన ఎంపికలు చేసుకోవచ్చు. ఇక భద్రతా పరంగా అత్యవసర నిధి, బీమా వంటి అంశాలను కూడా సమీక్షించుకోవడం కీలకం. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడే అత్యవసర నిధి ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కుటుంబ పరిస్థితులు మారితే బీమా కవరేజీని కూడా అప్‌డేట్ చేయాలి. బోనస్‌ల వినియోగంలో కూడా జాగ్రత్త అవసరం. మొత్తం డబ్బును ఒకేసారి ఖర్చు చేయకుండా, కొంత మొత్తాన్ని భద్రత కోసం ఉంచి, మిగతాను క్రమంగా పెట్టుబడులుగా మార్చడం ఉత్తమ పద్ధతిగా భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి