Reading Time: < 1 minute
ధర్మాజీపేటలో వరుస ఆలయ దొంగతనాలు.. హుండీలు, ఆభరణాలు మాయం!

భక్తికి నిలయాలైన ఆలయాలే ఆ దొంగలకు టార్గెట్ అయ్యాయి. తాళం వేసి ఉన్న గుడులను ఎంచుకుని మరీ వారు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.దైవ చింతన లేని కేటుగాళ్లు వరుసగా నాలుగు ఆలయాలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లారు.ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి, మడేలయ్య, గంగమ్మ, మరియు పెద్దమ్మ ఆలయాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. కేటుగాళ్లు కేవలం హుండీ కానుకలతో ఆగలేదు. అమ్మవార్ల ముక్కుపుడకలు, పుస్తెలు, మట్టెలు.. ఇలా దొరికిన కాడికి దోచుకెళ్లారు. ఉదయం ఆలయాల వైపు వెళ్లిన భక్తులు, తలుపులు తెరిచి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా విగ్రహాల ఆభరణాలు మాయమవ్వడం, హుండీలు పగలగొట్టి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని,కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. వరుస దొంగతనాలతో ధర్మాజీపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.