Reading Time: < 1 minute
Tirumala Sees Record 2 67 Crore Devotees In 2025 26 Highest Ever Footfall

Tirumala Devotees Record: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భక్తుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది మొత్తం 2.67 కోట్ల మంది భక్తులు శ్రీవారి దర్శనం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు అంటే 2023-24 సంవత్సరంలో 2.56 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్న సంఖ్య అత్యధికంగా ఉండేది. అయితే, 2025-26లో ఆ సంఖ్యను దాటి, అదనంగా సుమారు 11 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది.

Read Also: Israel-lebanon: అమెరికా మధ్యవర్తిత్వంలో లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు.. ఎప్పుడంటే..!

భక్తుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) మానిటరింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఈ వ్యవస్థ ద్వారా క్యూ లైన్లను సమర్థంగా పర్యవేక్షించడం, నిర్వహణను మెరుగుపరచడం వల్ల భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించగలిగారు. క్యూ లైన్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయడం వల్ల రోజుకు అదనంగా 3 నుంచి 4 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగలిగారు. దీంతో, మొత్తం వార్షిక భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు.. తిరుమలలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, సమర్థవంతమైన నిర్వహణ వల్ల భక్తులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం లభిస్తోంది. భవిష్యత్తులో కూడా భక్తుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం, శ్రీవారిపై ఉన్న భక్తి, విశ్వాసానికి నిదర్శనం. ఆధునిక సాంకేతికతతో కలిపిన సమర్థవంతమైన నిర్వహణ వల్ల ఈ రికార్డు సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.