Reading Time: 2 minutes
Modi Says Women Will Be Safe Only If Bjp Wins In Bengal Targets Tmc

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పూర్బ బర్ధమాన్, ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

‘‘బీజేపీ తీసుకున్న సంకల్పం కేవలం ఎన్నికల వాగ్దానం మాత్రమే కాదు. ఇది టీఎంసీ ‘జంగిల్ రాజ్’, ‘సిండికేట్ రాజ్’ అంతానికి సంకేతం. ఇకపై బెంగాల్ ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. అవినీతిపరులకు అండగా నిలుస్తున్న బెంగాల్‌లోని వారు ఒక్క విషయం గమనించాలి. మే 4వ తేదీ తర్వాత పలాయనం చిత్తగించడం మీరే చూస్తారు.’’ అని అన్నారు. మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

పూర్బ బర్ధమాన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘అవినీతి, శాంతిభద్రతలపై బీజేపీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుంది. తద్వారా ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిని చట్టప్రకారం పూర్తిగా జవాబుదారీగా చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం.’’ అని అన్నారు.

‘‘కేరళలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఎల్‌డీఎఫ్‌ గానీ, యూడీఎఫ్‌ గానీ తామే గెలుస్తామని కనీసం చెప్పుకోవడం కూడా లేదు. తమ ఓటమిని వారే స్వయంగా చూడగలుగుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.