Reading Time: < 1 minute
Mohammed Shami In Trouble Election Commission Issues Notice For Sir Hearing

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హియరింగ్‌కు హాజరుకావాలని షమీతో పాటు ఆయన సోదరుడు మొహమ్మద్ కైఫ్‌కు కూడా నోటీసులు అందాయి. సోమవారం దక్షిణ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతం కార్త్జు నగర్ స్కూల్ నుంచి నోటీసులు షమీకి అధికారికంగా జారీ అయ్యాయి. అయితే తాను విచారణకు హరాజరుకాలేనంటూ ఎన్నికల కమిషన్‌కు షమీ లేఖ రాశాడు.

మొహమ్మద్ షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ.. క్రికెట్ కెరీర్ కారణంగా చాలా ఏళ్లుగా కోల్‌కతాలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 93లో ఓటరుగా ఉన్నాడు. ఈ వార్డు రాష్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో షమీ ఓవర్ ఐడీ పత్రాలలో మ్యాపింగ్ సమస్య ఎదురైంది. ఓ వ్యక్తి పేరు రెండు చోట్ల ఉన్నపుడు లేదా చిరునామాలో సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు ఈ మ్యాపింగ్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం సరైన రుజువులతో రావాలంటూ ఎన్నికల కమిషన్ షమీని ఆదేశించింది.

Also Read: Shikhar Dhawan Marriage: రెండో పెళ్లి చేసుకోబోతున్న ‘గబ్బర్’.. ఎవరీ సోఫీ షైన్‌!

సోమవారం నిర్వహించిన హియరింగ్‌కు మొహమ్మద్ షమీ హాజరు కాలేకపోయాడు. ప్రస్తుతం ఆయన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్‌కోట్‌లో ఉన్నాడు. ఈ కారణంగానే హియరింగ్‌కు రాలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ‘ప్రస్తుతం బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుస్తూ రాజ్‌కోట్‌లో ఉన్నాను. మ్యాచ్‌లకు హాజరు కావడం తప్పనిసరి. కాబట్టి జనవరి 5న జరిగే విచారణకు హాజరు కాలేను. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా’ అని లేఖలో షమీ పేర్కొన్నాడు. షమీకి సంబంధించిన ఎస్ఐఆర్ హియరింగ్ జనవరి 9 నుంచి 11 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టులో షమీకి చోటు దక్కలేదు.