Reading Time: < 1 minute

 సెకండియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి హింసించినట్లు ఆరోపణ

హాస్టల్ నుంచి సీనియర్ల బహిష్కరణ

కాలేజీ నుంచి మూడు నెలల సస్పెన్షన్‌కు అధికారుల సమాయత్తం

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: అధికారులు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రాగింగ్ భూతం విద్యార్థులను వదిలిపెట్టడంలేదు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మోకాళ్లపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురిచేశారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్ విద్యార్థులపై చర్యలకు సిద్ద్ధమవుతున్నారు.

రాగింగ్ అనగానే కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు, సీనియర్స్ మధ్య ఉంటుందని అందరూ భావిస్తారు. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థుల మధ్య రాగింగ్ జరిగింది. రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూపులో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్న సమాచారం అందుకున్నారు. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు.

వారికి బుద్ది చెప్పి తీరాల్సిందేనని సీనియర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో హాస్టల్ టెర్రస్ పైకి 20 మంది జూనియర్ మెడికోలను పిలిచి మోకాళ్లపై కూర్చోబెట్టి తప్పయిందని.. మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు. ఇతరత్రా ఇబ్బంది పెట్టారని సమాచారం. ఇది నచ్చని కొంత మంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి దేశంలో సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌కు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు.