Reading Time: 2 minutes
Bengal Elections Humayun Kabir Sting Bjp Deal Ai Controversy

Bengal Elections: బెంగాల్ రాజకీయాల్లో హుమాయున్ కబీర్ వీడియో సంచలనంగా మారింది. బెంగాల్‌లోని ముస్లింల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, బీజేపీతో తనకు డీల్ ఉందని చెబుతున్నట్లుగా వీడియో చూపిస్తుంది. కబీర్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోలను విడుదల చేసింది. అయితే, ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసిందని, ముస్లిం ఓటర్లను తన నుంచి దూరం చేసేందుకు టీఎంసీ ఎత్తుగడ అని కబీర్ ఆరోపించారు. టీఎంసీపై పరువునష్టం కేసు పెడతానని హెచ్చరించారు.

అయితే, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐంఎం పార్టీ కబీర్ పార్టీతో పొత్తుకు నిరాకరించింది. అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తనను ఓడించడమే పీఎంఓ ఏకైక లక్ష్యమని అన్నారు. బీజేపీతో డీల్ ఉందని చెబుతున్నట్లు చూపిస్తున్న వీడియోపై అమిత్ షాను ప్రశ్నించగా, ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మించే వారితో కలవడం కన్నా 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు.

Read Also: Telangana Intermediate Second Year Results 2026

ఈ వీడియోలో హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. ముస్లింలను మోసం చేయడం సులభమని, బాబ్రీ అంశాన్ని ప్రస్తావించడం, రూ. 200 కోట్ల ముందస్తు నిధుల్ని డిమాండ్ చేయడం వంటి కామెంట్స్ చేశారు. టీఎంసీని దెబ్బతీసే విధంగా మైనారిటీ ఓట్లను తన వైపు తిప్పుకునేలా, దీని ద్వారా బీజేపీకి ప్రయోజనం చేకూరేలా తన వ్యూహాన్ని కబీర్ వివరిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆయన రూ. 1000 కోట్ల గురించి ప్రస్తావించడం ఇందులో ఉంది. దీంట్లో రూ. 200 కోట్ల అడ్వాన్స్ పొందినట్లు ఆయన చెబుతున్నట్లు వీడియో చూపించింది. కబీర్ ప్రధాని మోడీ, అమిత్ షా, మఖ్యమంత్రులు మోహన్ యాదవ్, హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తున్నట్లు ఉంది.

అయితే, ఈ ఆరోపణల్ని కబీర్ ఖండించారు. నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్‌లు ఒక ‘బూటకపు’ స్టింగ్ ఆపరేషన్‌ను నడిపించారని ఆయన ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఏఐని వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్టపాలు చేయాలని టీఎంసీ పన్నిన కుట్ర ఇదని, ఈ నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను కూడా అవమానించిందని ఆరోపించారు.