
మార్చి 2026 నెలలో భారతదేశ మ్యూచువల్ ఫండ్ రంగం కొత్త రికార్డులను సృష్టించింది. సామాన్యులు నెలల వారీగా పెట్టుబడి పెట్టే SIP ఇన్ ఫ్లో మొదటిసారిగా రూ. 32,087 కోట్లకు చేరింది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సిప్ పెట్టుబడులు ఏకంగా 24 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో దాదాపు 9.72 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. ప్రజలు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని మొత్తం ఆస్తుల విలువ (AUM) రూ. 73.73 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం సిప్ ద్వారా వచ్చిన ఆస్తులే రూ. 15.10 లక్షల కోట్లు (సుమారు 20.5 శాతం) ఉండటం విశేషం.
మ్యూచువల్ ఫండ్ ఖాతాల సంఖ్య మార్చి నాటికి 27.39 కోట్లకు చేరింది. కేవలం ఒక్క నెలలోనే 33.63 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు రావడం ఇది వరుసగా 61వ నెల. దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకోవడానికి భారతీయులు మ్యూచువల్ ఫండ్లను నమ్ముతున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.
Also Read:Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!
సిప్ పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ.. ఫిబ్రవరితో పోలిస్తే ఆస్తుల విలువ (Net AUM) కొంత తగ్గింది. అయితే.. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.