
CSK Crisis: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ప్రస్తుతం గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. 2025 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్కే.. ప్రస్తుత 2026 సీజన్లో కూడా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో జట్టు ఎంపిక, వేలంలో తీసుకున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ధరకు తగ్గ ప్రదర్శన ఎక్కడ?:
మినీ వేలంలో ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అనే ఇద్దరు ప్లేయర్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయితే, ఇప్పటి వరకు వారు ఆడిన తీరు చూస్తుంటే అంత భారీ ధర పెట్టడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని బద్రీనాథ్ అన్నారు. ఎవరో ఇచ్చిన సలహాలు విని అంత డబ్బు ధారపోశారు, కానీ క్షేత్రస్థాయిలో వారి ప్రదర్శన మాత్రం నిరాశాజనకంగా ఉందని విమర్శించారు.
స్కౌటింగ్ వైఫల్యంపై విమర్శలు:
ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించడంలో సీఎస్కే ఇతర జట్ల కంటే వెనుకబడి ఉందని సుబ్రమణ్యం బద్రీనాథ్ తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోసం హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు లాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్లను గమనిస్తూ ఆటగాళ్లను వెలికితీస్తారని కొనియాడారు. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి దిగ్గజాలు దొరకడానికి కారణం వారి స్కౌట్ జాన్ రైట్.. సీఎస్కేకు అటువంటి పటిష్టమైన స్కౌటింగ్ వ్యవస్థ లేకపోవడం మైనస్ అని వెల్లడించారు.
►ALSO READ | IPL 2026: రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక పోరు.. ఎవరు గెలుస్తారో తెలుసా!
శనివారం ఢిల్లీతో కీలక పోరు
వరుస ఓటములతో కుంగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, తమ తదుపరి మ్యాచ్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, జట్టులో సమూల మార్పులు జరిగితే తప్ప సీఎస్కేకి పూర్వ వైభవం రాదని స్పష్టమవుతోంది.