Reading Time: < 1 minute

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా… జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినులు మృతి

Caption of Image.

సెల్ఫీ మోజు మరో ముగ్గురు పసి ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా గడపాలని వెళ్లిన ఆ బాలికల విహారయాత్ర కాస్త  విషాద యాత్రగా మారింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మలంగుమ్మి వాటర్‌ఫాల్స్  దగ్గర ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  సమ్మర్  హాలిడేస్ కావడంతో   మలంగుమ్మి జలపాతం అందాలను చూసేందుకు ఐదుగురు మైనర్  బాలికలు సరదాగా వెళ్లారు. జలపాతంలో సెల్ఫీ తీసుకునేందుకు  దిగారు . అయితే దురదృష్టవశాత్తూ  ఒకరు  సెల్ఫీ తీసుకుంటుండగా..జలపాతంలోకి దిగిన  నలుగురు బాలికలు  అందులో  మునిగిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రమాద సమయంలో  స్థానికులను వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే ముగ్గురు బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) అనే ముగ్గురు బాలికలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నాల్గో అమ్మాయి అంజలి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

బాలికల  మరణంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లముందే ఆడుకుంటూ తిరిగిన పిల్లలు.. విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పర్యాటక ప్రాంతాలకు ముఖ్యంగా వాటర్ ఫాల్స్  దగ్గర  సెల్ఫీల కోసం సాహసాలు చేయవద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు 

©️ VIL Media Pvt Ltd.