
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. సచివాలయంలో దాదాపు 3 గంటలకు పైగా కేబినెట్ భేటీ కొనసాగగా.. ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి మండలి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సమావేశంలో 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB)లో చర్చించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి.
అదేవిధంగా, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా మూడు సంస్థల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక జోనల్ వ్యవస్థకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. రాష్ట్ర పరిపాలనలో సమతుల్యత కోసం తీసుకునే చర్యలపై అధికారులు వివరాలు సమర్పించారు. పలు పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ అనుమతులు ఇచ్చింది. మొత్తం 60కి పైగా ఎజెండా అంశాలను పరిశీలించిన కేబినెట్, వాటిలో ముఖ్యమైన వాటికి ఆమోదం తెలిపింది. మొత్తానికి, ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు నిర్ణయాలతో ముగిసిందని అధికారులు పేర్కొన్నారు.