Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi :  బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్.. వైభవ్ సూర్యవంశీ ఆట చూసి సౌతాఫ్రికా దిగ్గజం ఫిదా

Vaibhav Suryavanshi : ఐపీఎల్ అంటేనే సరికొత్త సంచలనాలకు వేదిక. కానీ 2026 సీజన్‌లో ఒక 15 ఏళ్ల కుర్రాడు సృష్టిస్తున్న ప్రకంపనలు చూస్తుంటే క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతను ఆడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మాత్రం ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే వైభవ్ సిక్సర్‌గా మలచడం గమనార్హం. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన ఈ టీనేజర్, బుమ్రా ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాది క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుతమైన హిట్టింగ్ వల్ల రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గ్రేమ్ స్మిత్ ప్రశంసల జల్లు

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వైభవ్ ఆటతీరును చూసి తన బ్లాగ్‌లో పొగడ్తలతో ముంచెత్తారు. “ఐపీఎల్ ఎప్పుడూ యంగ్ టాలెంటును గుర్తిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్లు ఉన్నప్పటికీ, రాజస్థాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై అందరూ కన్నేయాలి. అతను మొదటి బంతి నుంచే ఎటాకింగ్ చేసే విధానం చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఈ టోర్నీలో అతను ఒక రియల్ సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు” అని స్మిత్ పేర్కొన్నారు.

కుంబ్లే ఆశ్చర్యం

భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని చూసి ముగ్ధుడయ్యారు. బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కొనేటప్పుడు సీనియర్లే తడబడతారు, అలాంటిది ఈ చిన్న వయసులో తొలి బంతికే సిక్సర్ కొట్టడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు. 2008 ఐపీఎల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడైన స్మిత్ మాట్లాడుతూ.. ఐపీఎల్ వల్ల ప్రపంచ క్రికెట్ రూపురేఖలు మారిపోయాయని, ఇలాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడమే దానికి నిదర్శనమని చెప్పారు.

రికార్డుల క్రియేటర్

వైభవ్ సూర్యవంశీకి టీ20 క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కేవలం 378 బంతులు ఎదుర్కొని 68 భారీ సిక్సర్లు బాదాడు. అతని బ్యాటింగ్ పవర్ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ అతనికి ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. అందులోనూ ప్రపంచ మేటి బౌలర్‌ను ధైర్యంగా ఎదుర్కొని తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ 15 ఏళ్ల యువ కిరణం భవిష్యత్తులో భారత క్రికెట్ తలరాతను మారుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.