
మన ఇంటి పైన లేదా వీధి చివర ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులను మనం రోజూ చూస్తుంటాం. కానీ అసలు ఆ ట్యాంకులను అంత ఎత్తులో ఎందుకు నిర్మిస్తారో.. వాటిని నేల మీద నిర్మిస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? నీటి ట్యాంకులను ఎత్తులో ఉంచడం వెనుక కేవలం సౌకర్యం మాత్రమే కాదు అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. నీటి ట్యాంకును ఎత్తులో నిర్మించడానికి ప్రధాన కారణం గురుత్వాకర్షణ శక్తి. నీరు ఎత్తులో ఉన్నప్పుడు దాని బరువు కింది వైపుకు పీడనాన్ని సృష్టిస్తుంది. దీనినే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారు. ఎత్తు పెరిగేకొద్దీ పీడనం పెరుగుతుంది. ట్యాంకు ఎంత ఎత్తులో ఉంటే, పైపుల్లో నీటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతి 10 మీటర్ల ఎత్తుకు, చదరపు సెంటీమీటరుకు సుమారు 1కిలో పీడనం పెరుగుతుంది. మన ఇంట్లో కుళాయిలు, షవర్లు, ఫ్లష్లు వేగంగా పనిచేయాలంటే కనీసం 30-40 మీటర్ల ఎత్తులో ట్యాంక్ ఉండటం అవసరం.
విద్యుత్ ఆదా – నిరంతర సరఫరా
ట్యాంకును ఎత్తులో ఉంచడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం విద్యుత్ ఆదా. ట్యాంకు నేల మీద ఉంటే మనం ట్యాప్ తిప్పిన ప్రతిసారీ నీరు రావడానికి మోటారును నడపాల్సి ఉంటుంది. కానీ ఎత్తులో ట్యాంక్ ఉంటే, ఒక్కసారి నీటిని నింపితే చాలు.. ఆ తర్వాత మోటారు అవసరం లేకుండానే గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు ట్యాప్లలోకి వస్తుంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన సమయంలో కూడా ట్యాంకులో నిల్వ ఉన్న నీరు ఎత్తులో ఉండటం వల్ల పీడనంతో కిందికి వస్తుంది. ఇది అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగకరం.
భూగర్భ ట్యాంకుల కంటే ఎత్తైన ట్యాంకులే మేలు
నీటిని భూమి కింద కూడా నిల్వ చేయవచ్చు. కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భూగర్భ ట్యాంకుల్లో లీకేజీలు వస్తే వాటిని గుర్తించడం, సరిచేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని. భూమి కింద ఉండటం వల్ల మురుగునీరు లేదా ఇతర బ్యాక్టీరియా నీటిలో కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఎత్తులో నిర్మించిన ట్యాంకులను చెక్ చేయడం, శుభ్రపరచడం చాలా సులభం.
అత్యవసర పరిస్థితుల్లో రక్షణ
పెద్ద నగరాల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో ఎత్తైన ట్యాంకులు కేవలం నిత్యవసరాలకే కాకుండా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ హైడ్రెంట్స్కు తగినంత పీడనంతో నీటిని అందించడానికి కూడా ఉపయోగపడతాయి. పంపులు విఫలమైనా గురుత్వాకర్షణ శక్తి ద్వారా నీరు వేగంగా మంటలను ఆర్పడానికి సహాయపడుతుంది. చిన్న ఇంట్లో ఉండే ప్లాస్టిక్ ట్యాంక్ అయినా నగరానికి నీటిని అందించే భారీ ట్యాంక్ అయినా.. ఆ ఎత్తు వెనుక ఉన్న రహస్యం పీడనాన్ని సమతుల్యం చేయడం, ఖర్చును తగ్గించడమే. అందుకే ఆధునిక ఇంజనీరింగ్లో కూడా ఈ పురాతన గురుత్వాకర్షణ పద్ధతినే ఇప్పటికీ అనుసరిస్తున్నారు.