
రోజురోజుకు ఎండ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మండుటెండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. 42 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈ క్రమంలోనే ఎండల నుంచి జనం తమకు తామ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ మండే ఎండల్లో ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి అనేది స్పష్టం చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
- మండే ఎండల్లో ఇవి చేయండి..
>>> దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి.
>>> బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
>>> ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
>>> పుచ్చకాయ, కర్బూజా, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
>>> ఇంట్లో కిటికీలకు పరదాలు తీసి ఉంచాలి. గాలి తగిలేలా చూసుకోవాలి.
- ఎండల్లో ఇవి చేయకండి :
>>> మధ్యాహ్నం పూట కష్టమైన పనులు చేయకూడదు.
>>> ఖాళీ కడుపుతో, చెప్పులు లేకుండా ఎండలోకి వెళ్లొద్దు.
>>> ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది.. వాటికి దూరంగా ఉండాలి.
>>> ఎక్కువ ప్రోటీన్ ఉండే మాంసాహారం, మసాలా దినుసులు, నూనెలో వేయించిన పదార్థాలు తినొద్దు.
- ఈ లక్షణాలుంటే.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిందే :
తీవ్రమైన తలనొప్పి, వాంతులు, అలసట, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మందులను సిద్ధంగా ఉంచామని, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, బస్తీ, పల్లె దవాఖానల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
►ALSO READ | జ్యోతిష్యం: 2028 నుంచి 2032 మధ్య మూడో ప్రపంచ యుద్ధం: శని, రాహు గ్రహాల మార్పు దీనికి సంకేతమా..!