
సామాన్యులకు పెట్టుబడి అంటే మొదట గుర్తొచ్చేది భద్రత. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా, పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ ఉండాలని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వరం. కేవలం రోజుకు 300 రూపాయలు పక్కన పెడితే, పదేళ్లలో ఏకంగా 15 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని వెనకేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనేది ఒక చిన్న పొదుపు పథకం. ఇందులో మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని నిర్ణీత కాలం పాటు జమ చేయాల్సి ఉంటుంది. కేవలం రూ.100తో ఖాతా తెరవవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 6.70 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతుంది. ప్రాథమికంగా ఈ ఖాతా 5 ఏళ్ల కాలపరిమితి కలిగి ఉంటుంది. అవసరమైతే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు.
రూ. 15 లక్షల మ్యాజిక్ ఎలా జరుగుతుంది..?
మీరు ప్రతిరోజూ రూ.300 ఆదా చేయగలిగితే.. నెలకు రూ. 9,000 డిపాజిట్ అవుతుంది. 5ఏళ్లలో మీరు జమ చేసే అసలు మొత్తం రూ. 5.40 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి ఈ ఫండ్ రూ. 6 లక్షల మార్కును దాటుతుంది. ఇదే పెట్టుబడిని మరో 10 ఏళ్లు కొనసాగిస్తే.. మీ అసలు పెట్టుబడి రూ. 10,80,000 అవుతుంది. 10 ఏళ్లు పూర్తయ్యేసరికి మీకు అందే మెచ్యూరిటీ మొత్తం రూ. 15,20,889. అంటే ఇందులో మీరు పొందే వడ్డీ మాత్రమే రూ. 4,40,889 అన్నమాట.
ఈ పథకంలోని ప్రత్యేక సౌకర్యాలు
10 ఏళ్లు పైబడిన పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండాక కేవైసీ పూర్తి చేసి సొంతంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసరంగా డబ్బు అవసరమైతే, ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే కనీసం 12 నెలల వాయిదాలు చెల్లించి ఉండాలి. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ సొమ్ముకు వంద శాతం భద్రత ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇ-బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా నిర్వహించవచ్చు.
ఖాతా ఎలా తెరవాలి..?
మీకు సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీసులోనైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. దీనికోసం మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉండటం తప్పనిసరి. మీరు ప్రతి నెలా ఆటోమేటిక్గా సేవింగ్స్ ఖాతా నుండి ఆర్డీకి డబ్బు వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు. పిల్లల చదువులకైనా, పెళ్లిళ్లకైనా లేదా రిటైర్మెంట్ అవసరాలకైనా ఈ పదేళ్ల పొదుపు ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే పొదుపు ప్రారంభించి, ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.