
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరే వలలో చిక్కుకోవద్దు.. వారి మాయలో పడొద్దు అంటూ పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. ఇంకా.. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని.. డబ్బులు పోగొట్టుకుంటున్నవారు లేకపోలేదు.. అయితే, ఓ స్కూల్ విద్యార్థి టైమింగ్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసింది.. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సైబర్ మోసం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో ఒక జంటను సుమారు 10 గంటల పాటు వీడియో కాల్లో బందీలుగా ఉంచిన సైబర్ నేరగాళ్ల కుట్రను, అదే ఇంట్లో ఉన్న ఎనిమిదో తరగతి విద్యార్థి తన చాకచక్యంతో భగ్నం చేశాడు.
ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వ్యాపారవేత్త సంజయ్ సక్సేనాకు ఒక రోజు గుర్తుతెలియని నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను దర్యాప్తు సంస్థ అధికారి అని చెప్పుకుంటూ, సంజయ్ మొబైల్ నంబర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉపయోగించబడిందని ఆరోపించాడు. అంతేకాకుండా వీడియో కాల్లో యూనిఫామ్ ధరించి కనిపిస్తూ, అరెస్ట్ వారెంట్ చూపించి భయపెట్టాడు. ఈ నాటకంతో భయాందోళనకు గురైన ఆ జంటను సైబర్ నేరగాళ్లు నిరంతరం వీడియో కాల్లో ఉంచి “డిజిటల్ అరెస్ట్” పేరిట మానసికంగా బంధించారు. ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని, ప్రతి పని కెమెరా ముందు చేయాలని, కాల్ను ఎప్పటికప్పుడు ఆన్లో ఉంచాలని ఒత్తిడి చేశారు. భోజనం చేసినా, నిద్రపోయినా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దని హెచ్చరించారు.
ఇలా సుమారు 10 గంటల పాటు ఆ జంటను భయపెట్టిన మోసగాళ్లు, వారి బ్యాంక్ వివరాలను కూడా సేకరించి డబ్బు దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న సంజయ్ కుమారుడు తన్మయ్కు ఇది మోసమని అనుమానం వచ్చింది. అతను తన తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినా, భయంతో అతడు వినలేదు. చివరికి అర్ధరాత్రి సమయంలో తన్మయ్ ధైర్యంగా ముందడుగు వేసి తన మొబైల్ ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. దీంతో వెంటనే వీడియో కాల్ కట్ అయి, సైబర్ నేరగాళ్ల కుట్ర విఫలమైంది. ఈ చిన్న చర్యతో భారీ ఆర్థిక నష్టం తప్పింది.
ఇక, తర్వాత రోజు ఉదయం ఆ కుటుంబం ప్రేమ్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఇలాంటి వీడియో కాల్స్ లేదా బెదిరింపులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ ఘటనలో చిన్నారి తన్మయ్ చూపిన తెలివితేటలు, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అతని సమయోచిత నిర్ణయం వల్ల ఒక పెద్ద సైబర్ మోసం తప్పినట్టు అయ్యింది..