Reading Time: < 1 minute

ప్రియురాలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన ఘటన..ఉరేసుకుని యువతి ఆత్మహత్య

Caption of Image.

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో హెచ్ఐవి పాజిటివ్  రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధితురాలు రమణి  ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న రమణి  ఏప్రిల్ 10న  తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రమణి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అసలు ఏం జరిగింది?

రమణి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కక్షతో మనోహర్ అనే యువకుడు మార్చి 11వ తేదీన  ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కించాడు. ఈ  ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే  శరీరంలోకి ప్రమాదకర వైరస్ చేరిందన్న భయం, సమాజంలో ఎదురయ్యే వివక్షను తలుచుకుని రమణి గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ వేదనను భరించలేకే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

©️ VIL Media Pvt Ltd.