Reading Time: < 1 minute
Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్.. వీడియో వైరల్..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ బాబా నగర్‌లో ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు, కేవలం గంట వ్యవధిలోనే భారీ స్కెచ్ వేసి రూ. 20 లక్షల నగదుతో పాటు భారీగా బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. స్థానిక వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైకులపై వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టారు. లోపలికి ప్రవేశించిన దుండగులు బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదు, నగలను దోచుకున్నారు. యజమాని తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల కావడంతో షాక్‌కు గురై డయల్ 100కు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు – తెలిసిన వారేనా?

ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు దుండగులు బైకులపై రావడం, ఒకడు టవల్‌తో ముఖం దాచుకుని లోపలికి వెళ్లడం రికార్డయ్యింది. ఫిరోజ్ కుటుంబం బయటికి వెళ్లిన విషయాన్ని గమనించి, కేవలం గంటలోనే దొంగతనం ముగించడాన్ని బట్టి ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమ్మర్.. దొంగలకు సీజన్

వేసవి సెలవుల దృష్ట్యా చాలా కుటుంబాలు వెకేషన్లకు, ఊళ్లకు వెళ్తుంటాయి. ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌ని రంగంలోకి దించి దొంగల వేట మొదలుపెట్టారు.