
కరీంనగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం జరిగింది. అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాదు.. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్నాయి.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి ఏప్రిల్ 3న ఇవాళ ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపం కాస్త కన్నప్రేమను కప్పేసింది. తన కవలలైన ఇద్దరు కూతుళ్లపై ఆ కసిని తీర్చుకున్నాడు. సుమారు ఐదేళ్ల వయస్సున్న ఆ కవల పిల్లలకు బలవంతంగా గడ్డి మందు తాగించాడు. అంతటితో ఆగకుండా వారిని తీసుకువెళ్లి సమీపంలోని బావిలో పడేశాడు.
►ALSO READ | సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఆటో డ్రైవర్ దాడి
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక కూతురు మృతదేహం బావిలో లభ్యమవ్వగా మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. అమానుషానికి పాల్పడిన శ్రీశైలంను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.