
మన తెలంగాణ/గచ్చిబౌలి/ సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కొండాపూర్లోని క్వాక్ ఎరినా పబ్లో గురువారం అర్ధరాత్రి ఈగల్ టీమ్ దాడులు జరిపింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్, గచ్చిబౌలి పోలీసులు కలిసి పబ్బుపై ఆకస్మికంగా డాడి చేయడంతో డ్రగ్స్ తీసుకున్న ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. పబ్బులో గురువారం బ్లాక్ కాఫీ పేరుతో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించగా, ఇందులో 1,500 మంది పాల్గొన్నారు. పబ్బులో ఉన్న 64 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. వా రిలో వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లున్నారు. ఆ రుగురు హైదరాబాద్కు చెందినవారు కాగా, మ హారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు కూడా ఉండటం గమనార్హం. పోలీసు ల కథనం ప్రకారం.. డ్రగ్స్పై నిఘా పెట్టిన ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో ఉన్న క్వాక్ ఎరినా పబ్లో అంతర్జాతీయ డీజే ప్లేయర్తో బ్లాక్ కాఫీ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
ఈవెంట్పై నిఘా పెట్టిన ఈగల్ పోలీసులు పబ్బులో డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారిగురించి తెలుసుకున్నారు. ఆరు బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్బులో ఉన్న 64 మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి గంజాయి, బెంజోడియాజెపైన్ ఆనవాళ్లు బయటపడగా ముగ్గురికి గంజాయి, మెథాంఫేటమిన్ పాజిటివ్ వచ్చింది. మోనిష్ ఉమేష్, పృథ్వీరాజ్, అభిషేక్, రిషబ్, ఆకెళ్ల హరిత్ సారంగ్ (ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు), రితేష్, జ్యోతిరాధిత్యలకు పాజిటివ్ వచ్చింది. వీరిని స్థానికంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి శుక్రవారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాజిటివ్ వచ్చినవారిపై ఎన్డీపీఎస్ 1985 సెక్షన్ 8 (సీ), 27(ఏ), 27(బీ) కింద కేసు నమోదు చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు.
పబ్బులో సినీ నటి హేమ..
పబ్బులో నిర్వహించిన ఈవెంట్కు సినీనటి హేమ హాజరు కాగా, ఈగల్ పోలీసులు ఆమెకు కూడా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్గా వచ్చినట్లు తెలిసింది. స్పెయిన్కు చెందిన ఆర్టిస్టు అలెగ్జాండర్, డీజే ప్లేయర్ కేవీకి నెగిటివ్ వచ్చింది.