
SSC Exams 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల్లో దొర్లిన కొన్ని పొరపాట్ల కారణంగా విద్యార్థులకు మార్కులు కలపాలని ఎస్ఎస్సీ (SSC) బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రధానంగా హిందీ, ఇంగ్లిష్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో అడిగిన కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండటంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో హిందీ పరీక్షలోని సదరు ప్రశ్నకు 2 మార్కులు, అలాగే ఇంగ్లిష్ పరీక్షలో అదే తరహాలో ఉన్న మరో ప్రశ్నకు 5 మార్కులు అదనంగా కలపాలని బోర్డు భావిస్తోంది. ఈ మార్కుల కేటాయింపు విధానంపై పూర్తి స్పష్టతనిస్తూ బోర్డు ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
మరోవైపు ఇంగ్లిష్ పేపర్ లోని 28వ ప్రశ్నపై కూడా చర్చ జరుగుతోంది. వర్క్ బుక్ నుండి వచ్చిన ఈ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది. అయితే కేవలం కొన్ని ప్రశ్నలకే పరిమితం కాకుండా.. పాఠ్యపుస్తకాల్లో లేని, విద్యార్థులను గందరగోళపరిచే విధంగా ఉన్న మొత్తం ఐదు ప్రశ్నలకు మార్కులు కలపాలని స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శిఖరం నరహరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నలు ఇచ్చినప్పుడు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై బోర్డు తీసుకునే తుది నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.