
Priyansh Arya : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే రికార్డుల మోత మోగిస్తోంది. నిన్న రాత్రి (ఏప్రిల్ 3) చెన్నైలోని చెపాక్ స్టేడియం సాక్షిగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి, ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ పేరు మీద ఒక అరుదైన రికార్డును లిఖించాడు. చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన 210 పరుగుల సవాలును పంజాబ్ కింగ్స్ ఏమాత్రం తడబడకుండా స్వీకరించింది. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య మొదటి ఓవర్ నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫోర్ కొట్టి ఖాతా తెరిచిన ఆర్య, రెండో బంతికే కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 350 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దురదృష్టవశాత్తూ హెన్రీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ, అప్పటికే పంజాబ్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కేవలం 3.2 ఓవర్లలోనే (అంటే 20 బంతుల్లోనే) జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన టీమ్ ఫిఫ్టీగా రికార్డుల్లోకెక్కింది. గతంలో 2011లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా సరిగ్గా 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసింది. ఇప్పుడు ఆ రికార్డును పంజాబ్ సమం చేయడమే కాకుండా, చెపాక్ స్టేడియంలో ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీ కొట్టిన జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య జోడీ మొదటి వికెట్కు కేవలం 4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ఎంఏ చిదంబరం స్టేడియంలో సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పేరుంది. కానీ పంజాబ్ బ్యాటర్లు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేశారు. ఆరు ఓవర్ల పవర్ప్లే ముగిసేసరికి పంజాబ్ స్కోరు బోర్డు 80 పరుగులు దాటేసింది. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో ఈ ఇన్నింగ్స్ నిరూపించింది. సీఎస్కే వంటి పటిష్టమైన బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై వారి సొంత గడ్డపైనే ఇంత వేగంగా పరుగులు సాధించడం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
ఐపీఎల్లో గతంలో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా వేగవంతమైన పవర్ప్లే స్కోర్లు సాధించినప్పటికీ, పంజాబ్ నమోదు చేసిన ఈ 20 బంతుల హాఫ్ సెంచరీ టాప్ లిస్టులోకి చేరిపోయింది. గతేడాది యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లో వ్యక్తిగత హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు ఉండగా, ఇప్పుడు టీమ్ పరంగా పంజాబ్ చూపించిన జోరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన పంజాబ్, ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..