
హైదరాబాద్: క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బిఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణిని, వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి మిట్టపల్లి సరితను బిఆర్ఎస్, సిపిఐ సభ్యులు ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో బిఆర్ఎస్, ఏడు వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలిచారు. బిఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠంను కైవసం చేసుకుంది. గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఇవాళ క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించారు. దీంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మున్సిపల్ చైర్మన్గా బిఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.