Reading Time: 2 minutes
Off The Record About Congress Struggles In Brs Stronghold Siddipet Amid Internal Conflicts

Off The Record: బీఆర్‌ఎస్‌ కంచుకోట సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో కేసీఆర్, తర్వాత హరీష్‌రావు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1983లో చివరిసారిగా సిద్దిపేటలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 85 నుంచి 99 వరకు TDP తరపున కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. ఇక TRS పెట్టినపప్పటి నుంచి కేసీఆర్, హరీష్‌రావులు వరుసగా గెలుస్తూ నియోజకవర్గంతో పాటు జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా సిద్దిపేట జిల్లాలో మాత్రం BRS పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్‌కు కేవలం 23 వేల ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ బలడుతుందని అందరూ అనుకున్నారు. అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కానీ…గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం పెద్దల అంచనాలకు తగ్గట్టుగా లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పూజల హరికృష్ణ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నారు. హరికృష్ణ మీద పార్టీ సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారట. ఆయన వ్యవహార శైలి నచ్చక కొంతమంది నేతలు పార్టీలోనే ఉండి..వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రూపులు పెరిగిపోయి హస్తం ఇంకా బలహీనపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

నియోజకవర్గం మీద పట్టుకోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు తప్ప… పార్టీని బలోపేతం చేసేందుకు అంతా కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదన్నది కేడర్‌ మాట. ప్రస్తుతం సిద్దిపేట కాంగ్రెస్‌ పరిస్థితి గ్రూపులు ఎక్కువ, లీడర్లు తక్కువ అన్నట్టుగా ఉందట. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో నామ మాత్రపు పోటీ ఇచ్చింది అధికార పార్టీ. ఇదిలా ఉంటే నామినేటెడ్ పోస్టుల వ్యవహారం నియోజకవర్గంలో తాజాగా కాక రేపుతోంది. సిద్దిపేట, నంగునూర్, చిన్నకోడూరు మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పోస్టులకు అధికార పార్టీ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే నంగునూర్, చిన్న కోడూరు మార్కెట్ కమిటీలకు చైర్మన్స్‌ను ప్రకటించారు. ఇక వైస్ చైర్మన్, డైరెక్టర్స్‌ పదవుల పంపకాల విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ హరికృష్ణ నామినేటెడ్‌ పోస్ట్‌లను అమ్ముకుంటున్నారని కొందరు సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టులకు రేటు కడుతున్నారంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. నంగునూర్‌లో హరికృష్ణ ఫ్లెక్సీని దహనం చేసి… ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక్కరు కూడా లేరని…పవర్‌ రాగానే పదవుల కోసం పాకులాడుతున్నారని కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారు. అధికారంలో లేకున్నా పని చేసిన మాపై కేసులు? పదవులు మీకా అంటూ ఫైర్ అవుతున్నారట పాత నేతలు. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని పార్టీ నాయకుడు అత్తు ఇమామ్ ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు అధిష్టానంలోని పలువురు నేతలను కలిశారాయన. ఇమామ్ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. పెద్దల మద్దతు కూడా ఆయనకే ఉన్నట్టు సమాచారం. కానీ… కేడర్‌లో మాత్రం అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయట ఇప్పటికే చిన్నకోడూరు, నంగునూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను అమ్ముకున్నారని, వాటిలాగే… సిద్దిపేట పదవిని కూడా అమ్ముకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నది కేడర్‌ మాట. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి సారించి పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. పదవుల పంపకాలలో లొల్లి…పార్టీలో నేతల మధ్య విబేధాలతో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. ఈ విషయంలో పీసీసీ జోక్యం చేసుకుని జాగ్రత్తగా డీల్‌ చేయాలని, లేకుంటే బలమైన ప్రతిపక్షం ఉన్నచోట మనం పుంజుకునే అవకాశం కూడా ఉండబోదని హెచ్చరిస్తున్నారు.