Reading Time: 2 minutes
Pakistan Fuel Crisis Price Hike Inflation Impact Middle East War

Pakistan Fuel Crisis: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రపంచానికి ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇతర దేశాలలో యుద్ధం జరుగుతున్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని పాకిస్థానీ ప్రజలే ఎక్కువగా భరిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించకపోగా, వారిపై బాదుడు షురూ చేసింది. పన్నులను పెంచి, రాయితీలను తగ్గించింది. ఇంధనం, విద్యుత్, ఆహారం మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

READ MORE: Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

కేవలం కొన్ని వారాల క్రితం, ఇంధన ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. తాజాగా మరోసారి భారం మోపింది అక్కడి ప్రభుత్వం. ఈసారి డీజిల్ ధరలు 54.9% పెరిగి లీటరుకు 520.35 పాకిస్థానీ రూపాయలకు ($1.88) చేరగా, పెట్రోల్ ధరలు 42.7% పెరిగి లీటరుకు 458.40 పాకిస్థానీ రూపాయలకు చేరాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరగడం వల్ల, పాకిస్థానీలు అల్లాడుతున్నారు. బస్సు, ట్రక్కు, ఆటో ఛార్జీలు సైతం భారీగా పెంచారు. సరుకు రవాణా, రవాణా ఖర్చులు అధికమవ్వడంతో నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాకిస్థాన్‌లో మరోసారి ద్రవ్యోల్బణం రేటు తారా స్థాయికి చేరుకుంటోంది. జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 5.8 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 7.3 శాతానికి చేరుకుంది. దిగుమతుల వ్యయం పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పాకిస్థానీ రూపాయిపై ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం వివరీతంగా పెరగడం కారణంగా రవాణా, విద్యుత్ ఖర్చులు సైతం పెరిగాయి.

READ MORE: Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

చమురు సంక్షోభం కారణంగా ఇంధన ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మార్చిలో ఎల్‌పీజీ ధర ఒక సిలిండర్‌కు 2,665 పాకిస్థానీ రూపాయలు ఉండగా, ఇప్పుడు అది ఒక సిలిండర్‌కు 3,500 రూపాయలకు చేరుకుంది. ఇది ఒక్క నెలలోనే 900 పాకిస్థానీ రూపాయలకు పైగా పెరుగుదలను సూచిస్తుంది. విద్యుత్ చార్జీలు సైతం తడిచి మోపెడు అవుతున్నాయి. మార్చి 2026 వరకు బిల్లులపై యూనిట్‌కు రూ.1.62 వరకు పెంపును ఆమోదించింది. పాకిస్థాన్‌లో విద్యుత్ టారిఫ్‌లు ఇప్పటికే ఆసియా దేశాల కంటే ఎక్కువగా ఉండగా, ఈ పెంపు మరిన్ని ఇబ్బందులను సృష్టించింది.

READ MORE: Pub Drugs Raid: పబ్ లో ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్..!

అంతేకాదు.. పిండి ధరలు 35 శాతం వరకు పెరిగాయి. 20 కిలోల పిండి బస్తా ధర రూ.2,000కి చేరగా, 1 కిలో ధర ఇప్పుడు రూ.160గా ఉంది. పప్పుధాన్యాల ధరలు రూ.250 నుంచి రూ.450కి పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2 నుంచి 9 శాతం వరకు పెరిగాయి. బంగాళదుంపలు ఇప్పుడు కిలో రూ.50, టమోటాలు కిలో రూ.250, ఉల్లిపాయలు కిలో రూ.80గా ఉన్నాయి. ఈ పెరుగుదలలు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లు ఏకంగా 10.5 శాతానికి చేరుకున్నాయి. దీనివల్ల గృహ, వ్యాపార, వ్యక్తిగత రుణాల ధరలు పెరిగాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి.