Reading Time: < 1 minute
Ambati Rambabu Questions Amaravati Completion By 2029 Slams Chandrababu

Ambati Rambabu: నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతి ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, 2029 నాటికీ రాజధాని పూర్తవుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2029 నాటికీ కనీసం ఏడు భవనాలైనా పూర్తి చేస్తారో లేదో అనుమానం ఉందని అన్నారు.

Read Also: Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!

మావిగన్ అనే కొత్త అభివృద్ధి ఆలోచనను కూడా అంబటి ప్రస్తావించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రతిపాదనగా పేర్కొంటూ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం సుమారు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ మావిగన్ ప్రాజెక్ట్‌ను కేవలం 20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని అంబటి పేర్కొన్నారు. మూడు జిల్లాలతో కూడిన ఈ కారిడార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వృద్ధి కేంద్రంగా మారుతుందని చెప్పారు.

అలాగే అమరావతి రైతుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు అంబటి. తమకు హామీ ఇచ్చిన ప్లాట్లు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఆర్డీఏ అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత లేకపోవడం వల్లే ఈ అయోమయం నెలకొంది అని అంబటి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజమేనని, అవసరమైతే కొత్త తీర్మానాలు ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. మొత్తంగా, అమరావతి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరోసారి రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. 2029 నాటికి రాజధాని పూర్తి అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.