మన శరీరంలోని కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు మూత్రపిండాల్లో పేరుకుపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మారుతాయి. ఇవే కాలక్రమేణా రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి మూత్ర నాళానికి అడ్డంకి కలిగించినప్పుడు విపరీతమైన నొప్పి, మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బీరు తాగితే రాళ్లు పోతాయనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని డాక్టర్ అమరేంద్ర పాఠక్ స్పష్టం చేశారు. బీరు తాగడం వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రాయి బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ ఇదే ఫలితాన్ని మనం మంచినీళ్లు లేదా నిమ్మరసం తాగడం ద్వారా కూడా పొందవచ్చు.
బీరులో ఉండే ఆల్కహాల్ శరీరానికి హాని చేయడమే కాకుండా, వ్యసనానికి దారితీస్తుంది. బీరు తాగడం వల్ల ఒక్కసారిగా మూత్రం పెరిగి, ఒకవేళ రాయి అడ్డం పడితే కిడ్నీలో వాపు వచ్చి పరిస్థితి మరింత విషమిస్తుంది. బీరు తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, అది కాలేయ సమస్యలకు కూడా దారితీస్తుంది.
పరిష్కారం ఏంటి?: సాధారణంగా 5 మి.మీ. కంటే చిన్నగా ఉండే రాళ్లు పుష్కలంగా మంచినీళ్లు తాగడం ద్వారా సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. నీరు మూత్రాన్ని పలుచగా చేసి, రాళ్లు సులభంగా కదిలేలా చేస్తుంది. అయితే రాయి పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు చికిత్స లేదా అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవాలి.
బీరు తాగితే కిడ్నీ రాళ్లు మాయం అనేది ఒక ప్రమాదకరమైన అపోహ. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీరుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సొంత వైద్యం మానుకొని, నిపుణులైన యూరాలజిస్ట్ను సంప్రదించడమే ఉత్తమ మార్గం.




