ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ విజయాల ఖతను తెరిచినా సంగతి తెలిసిందే. గురువారం కేకేఆర్తో జరిగిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్లలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత రెండు మ్యాచ్లలోనూ రెండు కీలకమైన క్యాచ్ల విషయంలో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీశాయి.
మొదటి వివాదాస్పద సంఘటన ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టిన సమయంలో అతడి కాలు బౌండరీ రోప్ను తాకినట్లు స్పష్టంగా అనిపించింది. దీనిపై ఫీల్డ్ అంపైర్ టీవీ అంపైర్కు రిఫర్ చేశారు. టీవీ అంపైర్ పలుమార్లు రీప్లేలను పరిశీలించి, చివరకు క్లాసెన్ను అవుట్గా ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ లాంటి ప్రముఖులు తప్పుపట్టారు. అంపైర్ మరింత సమయం వెచ్చించి క్యాచ్ను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇక కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ క్యాచ్ ఇలానే వివాదాస్పదంగా మారింది. అభిషేక్ శర్మ ఫుల్ షాట్ ఆడగా, బంతి వేగంగా లెగ్ సైడ్ వైపు గాలిలో వెళ్ళింది. బౌండరీ లైన్ ముందు నేలకు తాకేలా కనిపించింది. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ముందుకు డ్రైవ్ చేస్తూ బంతిని అందుకుని అవుట్ అంటూ సంబరాలు చేసుకున్నాడు. అభిషేక్ శర్మ క్రీజులోనే ఉండగా, అంపైర్లు టీవీ అంపైర్కు రిఫర్ చేశారు. పలుమార్లు క్యాచ్ను పరిశీలించిన టీవీ అంపైర్ చివరికి అభిషేక్ శర్మను అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన అభిషేక్ శర్మ మైదానం వీడాడు. టీవీ రిప్లైలో బంతి నేరుగా చేతుల్లోకి వెళ్లకుండా, బౌన్స్ అవుతూ వెళ్లినట్లుగా కనిపించింది. అయితే, అంపైర్ మాత్రం బంతి కింద చేతివేళ్ళు ఉన్నాయంటూ అవుట్ ఇచ్చాడు.
ఈ రెండు మ్యాచ్లలోని ఇద్దరు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు(క్లాసెన్, అభిషేక్ శర్మ) అవుట్ అయిన క్యాచ్లు వివాదాస్పదంగా మారాయి. వారు అవుట్ అయిన సమయాల్లో ఇద్దరూ మంచిగా ఆడుతున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత సన్రైజర్స్ బ్యాటింగ్ తడబడినట్లు గమనించవచ్చు. తొలి మ్యాచ్లో జట్టు ఓడగా, రెండో మ్యాచ్లో గెలిచింది. ఈ అంపైరింగ్ నిర్ణయాలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించేందుకు అంపైర్లు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
క్యాచ్ల విషయంలో టీవీ అంపైర్లు మరింత సమయం తీసుకుని, నాణ్యమైన కెమెరాలను ఉపయోగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీవీ అంపైర్ కూడా క్యాచ్పై ఎటు తేల్చుకోలేకపోతే, బ్యాటర్లకు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలనే నిబంధన ఉందని, అయితే ఈ రెండు పర్యాయాల్లో మాత్రం టీవీ అంపైర్ బ్యాటర్లను అవుట్గా ప్రకటించారని పలువురు వాదిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లలో నిర్ణయాల పారదర్శకత, స్పష్టతపై ఈ సంఘటనలు మరోసారి చర్చను రేకెత్తించాయి.




