Reading Time: < 1 minute
Toll Charges: క్యాష్ రూపంలో టోల్ చెల్లింపులు బంద్.. ఏప్రిల్ 10 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఆ రెండు ఆప్షన్లు..

వాహనదారులకు బిగ్ అలర్ట్. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు చెల్లించేందుకు క్యాష్ పేమెంట్స్ బంద్ కానున్నాయి. ఇక నుంచి నగదు రూపంలో టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజులు చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉండదు. ఇక నుంచి టోల్ రుసుంలు చెల్లించాలంటే కేవలం ఫాస్టాగ్, యూపీఐలను మాత్రమే అనుమతిస్తారు. టోల్ చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా డిజిటలైట్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వాహనదారులు దీని గురించి తప్పనిసరిగా తెలుసుకుని దానికనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడం, టోల్ గేట్ల వద్ద వెయిట్ చేయకుండా వేగవంతమైన ప్రయాణాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా నగదు చెల్లింపులను నిలిపివేసింది.

ఫాస్టాగ్, యూపీఐ ద్వారానే..

ఏప్రిల్ 10వ తేదీ నుంచి నగదు రూపంలో టోల్ ఫీజులు స్వీకరించరు. ఫాస్టాగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ లేని వాహనదారులు యూపీఐ సౌకర్యం ద్వారా చెల్లించవచ్చు. ఈ రెండు విధానాలు మాత్రమే అమల్లో ఉంటాయి. విడతల వారీగా నగదు లావాదేవీలను నిలిపివేయాలని కేంద్రం గతంలో ప్రతిపాదించింది. మొన్నటివరకు క్యాష్ రూపంలో చెల్లించేవారి నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసింది. అలాగే కేవలం  ఒకటి లేదా రెండు లైన్లను మాత్రమే ఈ విధానంలో చెల్లించేవారి కోసం కేటాయించింది. ఇప్పుడు దానిని పూర్తిగా అమలు చేసేందుకు సిద్దమైంది. డిజిటల్ టోలింగ్ పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు, టోల్ నెట్ వర్క్‌ను మెరుగుపర్చేందుకు ఈ మార్పు సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై 1150కిపైగా టోల్ గేట్లు ఉన్నాయి. అన్నిచోట్ల ఇది అమలు కానుంది.

ఉపయోగాలు ఇవే..

-టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుంది

-టోల్ ఛార్జి చెల్లింపుల్లో పారదర్శకత లభిస్తుంది

-ప్రయాణం మరింత సులభతరం, వేగం అవుతుంది

-టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ తగ్గుతుంది

-మెరుగైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది.