Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi : నెహ్రా కాళ్లు మొక్కిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. పసివాడి సంస్కారానికి ఫిదా అయిన గుజరాత్ కోచ్

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో పసికూనలా అడుగుపెట్టి పంజా విసురుతున్న బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ రాజస్థాన్ రాయల్స్ సంచలనం, మైదానంలో తన ఆటతోనే కాదు.. ప్రవర్తనతోనూ అందరి మనసు గెలుచుకుంటున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడకముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. మైదానంలో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కనిపించగానే, వైభవ్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి నెహ్రా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, వెంటనే ఆ కుర్రాడిని పైకి లేపి ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సంస్కారాన్ని వైభవ్ చాటుకోవడంతో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెహ్రా కూడా ఆ చిన్నారి ప్లేయర్ వినయానికి ముగ్ధుడై చిరునవ్వుతో కాసేపు ముచ్చటించారు.

వైభవ్ సూర్యవంశీకి గుజరాత్ టైటాన్స్ జట్టు అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతేడాది ఇదే జట్టుపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. సెకండ్ సీజన్ లో తడబడతాడని అందరూ అనుకున్నా, తనేంటో తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. తాజాగా ప్రాక్టీస్ లో జోస్ బట్లర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్లతో కలిసి వైభవ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు.

ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ కేవలం నెహ్రాతోనే కాదు, ఇతర సీనియర్ ప్లేయర్ల దగ్గర కూడా మెలకువలు నేర్చుకుంటూ కనిపించాడు. యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుకుంటున్నప్పుడు పక్కనే ఉండి వారు ఏం చర్చించుకుంటున్నారో చాలా ఆసక్తిగా వింటూ ఈవ్స్ డ్రాపింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. నేర్చుకోవాలనే తపన ఈ కుర్రాడిలో ఎంతలా ఉందో ఈ సంఘటన నిరూపిస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించిన ఈ వీరుడు, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

సీఎస్కేపై 17 బంతుల్లో 52 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వైభవ్ తన మనసులో మాట పంచుకున్నాడు. “బౌలర్లు నన్ను టార్గెట్ చేస్తారని అందరూ అంటున్నారు, కానీ మా కోచ్‌లు మాత్రం నన్ను నా నేచురల్ గేమ్ ఆడమని, పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయమని మద్దతు ఇస్తున్నారు” అని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ మెంటార్లు అతడికి ఇస్తున్న స్వేచ్ఛే అతడి సక్సెస్ సీక్రెట్ అని తెలుస్తోంది. నేడు గుజరాత్ తో జరిగే మ్యాచ్ లో ఈ 15 ఏళ్ల వండర్ బాయ్ మళ్ళీ ఏ రేంజ్ లో చెలరేగుతాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..