
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అతి పెద్ద వంతెనను కూల్చేసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు.
ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా సైన్యం ఇంకా ఇరాన్లో మిగిలినదాన్ని ధ్వంసం చేయడం కూడా ప్రారంభించలేదు.. తదుపరి లక్ష్యాలు బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లు. కొత్త నాయకత్వాన్ని ఏమి చేయాలో తెలుసు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి” అని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు.
‘‘ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంకా మరిన్ని దాడులు జరుగుతాయి. ఆలస్యమయ్యేలోపే ఒప్పందానికి రావాలి. లేకపోతే దేశం పూర్తిగా నాశనం అవుతుంది.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. కరాజ్ నగరంలోని బీ1 బ్రిడ్జ్పై జరిగిన దాడిలో కనీసం 8 మంది మృతి చెందగా, 95 మంది గాయపడ్డారు. బాధితుల్లో ప్రయాణికులు, స్థానికులు, అలాగే నేచర్ డే సందర్భంగా కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.
ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ దాడులపై స్పందిస్తూ.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా మా దేశం అన్ని విధాలుగా తగిన సమాధానం ఇస్తుంది.’’ అని స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని “అనవసర దాడి”గా ఇరాన్ అభివర్ణించింది.