Reading Time: < 1 minute
Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలు.. కేరళ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ..

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనను లక్ష్యంగా చేసుకుంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అక్కడి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర వాగ్దానాలు కేవలం ఏప్రిల్ ఫూల్ హామీలుగానే మిగిలిపోయాయని ఆయన విమర్శించారు. కేరళ విద్యావంతులైన పౌరులకు పెట్టింది పేరు అని ప్రశంసిస్తూనే.. ఎన్నికల సమయంలో వచ్చే పొలిటికల్ టూరిస్టుల మాటలు నమ్మవద్దని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని రేవంత్ చెప్పడం పచ్చి అబద్ధమని లేఖలో విమర్శించారు.

నెరవేరని హామీల చిట్టా ఇదీ..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 420కి పైగా వాగ్దానాలు అటకెక్కాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘‘రైతులకు రూ. 15,000, కూలీలకు రూ.12,000 ఇస్తామన్న హామీ ఎక్కడా అమలు కాలేదు. వరికి రూ. 500 బోనస్ ఊసే లేదు. నిధుల కొరత పేరుతో 40 లక్షల మంది రైతులను ప్రభుత్వం నట్టేట ముంచింది. మహిళలకు నెలకు రూ. 2,500, కళ్యాణమస్తు కింద 10 గ్రాముల బంగారం హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ అమలు కాలేదని, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న యువతకు మొండిచెయి మిగిలింది’’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ

అశాస్త్రీయమైన హామీల వల్ల తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ వాయిదాలు, పీఆర్‌సీ కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని లేఖలో వివరించారు. మూసీ పునరాభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంపై కూడా ఆయన ధ్వజమెత్తారు.

కేరళకు ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏనే

కేరళ.. ఇలాంటి బూటకపు హామీలకు బలికాకూడదంటూ కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ తోనే సాధ్యమని, కేరళ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ కూటమికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు.