Reading Time: < 1 minute

కోకాపేటలో అక్రమ మైనింగ్ కలకలం..! ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. విచారణకు స్వీకరణ

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: కోకాపేటలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. జీవో ఎంఎస్ 261 నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ స్థాయిలో రాక్ క్రషింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు చేసిన ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. ఈ కేసుకు నంబర్ 6984/IN/2026 కేటాయించినట్లు అడ్వకేట్ రామారావు తెలిపారు. 

భాగ్యలక్ష్మి మైనింగ్ సంస్థ పర్యావరణాన్ని నాశనం చేస్తూ, అక్రమ అనుమతులతో తవ్వకాలు చేపడుతోందని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. నిషేధం ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో మైనింగ్ కొనసాగుతోందని, దీనివల్ల పెరిగిన కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్, చీఫ్ సెక్రటరీ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని రామారావు ఇమ్మనేని డిమాండ్ చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.