
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు భారత్ సహా 60కి పైగా దేశాలు గురువారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించాయి. యూకే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి అమెరికా హాజరుకాకపోవడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం, జలసంధి భద్రతను నిర్ధారించకుండానే కార్యకలాపాలను నిలిపివేస్తుందేమో అన్న ఆందోళన మిత్రదేశాల్లో వ్యక్తమవుతోంది. సైనిక చర్య కంటే దౌత్యపరమైన, ఆర్థికపరమైన మార్గాల ద్వారానే నౌకాయానాన్ని పునరుద్ధరించాలని దేశాలు భావిస్తున్నాయి. ప్లాన్ బిలో భాగంగా ఈ చర్చల కోసం ఐక్యరాజ్యసమితిని రంగంలోకి దించడం, ఆంక్షల ద్వారా ఒత్తిడి తీసుకురావడంపై ఈ సమావేశంలో అన్ని దేశాలు చర్చించారు.
తన గలం వినిపించిన భారత్
ఇక మన దేశం నుంచి భారత విదేశాంగ కార్యదర్శి మిస్రి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకూడదని భారత్ స్పష్టం చేసింది. ఈ యుద్ధంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ అని ఆయన గుర్తుచేశారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది, కాబట్టి తక్షణమే ఉద్రిక్తతలు తగ్గాలని ఆయన కోరారు
వచ్చేవారం మరో సమావేశం
హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడానికి, అక్కడి మైన్లను తొలగించడానికి నౌకాదళ సంపత్తిని ఎలా మోహరించవచ్చనే అంశంపై చర్చించేందుకు పలు దేశాల మిలిటరీ ప్లానర్లు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అయితే, ఇరాన్ అంగీకారం లేకుండా సైనికపరంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దానికి బదులుగా, ఆయా దేశాలు సమన్వయంతో కూడిన దౌత్యపరమైన ఒత్తిడిని, ఆంక్షలతో సహా, చర్చల్లో ఐక్యరాజ్యసమితి పాత్రను పరిశీలిస్తున్నాయి. నిలిచిపోయిన ఓడల కోసం సురక్షితమైన సముద్ర మార్గాలను రూపొందించడంలో సహకరించాలని విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి ప్రాతినిధ్యం వహిస్తున్న జపాన్ కోరింది.
చిక్కుకుపోయిన 2వేల నౌకలు
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రకారం, జలసంధికి ఇరువైపులా సుమారు 2,000 నౌకలు చిక్కుకుపోయాయి. చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జపాన్ వంటి దేశాలు ఇప్పటికే విద్యుత్ వినియోగంపై పరిమితులు విధిస్తూ, పని దినాలను తగ్గిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.