Reading Time: 2 minutes
Raghav Chadha Reacts Aap Removal Rajya Sabha Silence Not Defeat

ఆమ్ ఆద్మీ పార్టీలో మరోసారి భారీ కుదుపు జరిగింది. ఒకప్పుడు స్వాతి మాలివాల్‌‌పై ఏకంగా భౌతిక దాడి జరగగా… ఇప్పుడు మరో ఎంపీపై పరోక్ష దాడి జరిగింది. రాజ్యసభలో కీలక పాత్ర పోషిస్తూ… రాజ్యసభ ఉప నాయకుడి పదవిలో ఉన్న రాఘవ్ చద్దాపై వేటు వేసింది. ఊహించని రీతిలో ఆప్ అధిష్టానం పదవి నుంచి తొలగించింది. ఇకపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభకు లేఖ రాసింది. ఈ పరిణామంతో రాఘవ్ చద్దా ఒక్కసారిగా భారీ షాక్‌కు గురయ్యారు.

తాజాగా ఈ అంశంపై ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మౌనాన్ని ఓటమిగా పొరపాటు పడకండి. నన్ను మౌనంగా ఉంచారు. కానీ నేను ఓడిపోలేదు’’ అంటూ భావోద్వేగభరితమైన వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

‘‘పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రజా సమస్యలను లేవనెత్తుతాను. ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా? నేను ఏమైనా నేరం చేశానా?, మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటుకు చెప్పినందుకే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. నన్ను మాట్లాడకుండా ఎవరైనా ఎందుకు ఆపాలనుకుంటారు? నేను మాట్లాడినప్పుడు ప్రజా సమస్యల గురించి, సామాన్యుడి గురించి మాట్లాడతాను.’’ అని రాఘవ్ చద్దా అన్నారు.

‘‘విమానాశ్రయంలో ఖరీదైన ఆహారం అందించడం. జొమాటో-బ్లింకెట్ డెలివరీ రైడర్లు ఎదుర్కొంటున్న సమస్యలు. ఆహారంలో కల్తీ సమస్యను లేవనెత్తి. టోల్ ప్లాజా దోపిడీ. బ్యాంకు ఛార్జీల దోపిడీ గురించి మాట్లాడాను. మధ్యతరగతిపై పన్నుల భారం, కంటెంట్ క్రియేటర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారు. టెలికాం కంపెనీలు 12 నెలల్లో 13 సార్లు రీఛార్జ్ చేయించడం.. డేటా రోల్‌ఓవర్ ఇవ్వకపోవడం, రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేయడం వంటి సమస్యలన్నింటినీ నేను సభలో ప్రస్తావించాను.’’ అని రాఘవ్ చద్దా గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ సమస్యలను లేవనెత్తడం వల్ల సామాన్యులకు మేలు జరుగుతుందని.. అయితే దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగే నష్టం ఏమిటని నిలదీశారు. నన్ను మాట్లాడకుండా ఎవరైనా ఎందుకు ఆపాలనుకుంటారు. నా గొంతును ఎందుకు నొక్కేయాలనుకుంటారు?, మీరు నాకు అపరిమితమైన ప్రేమను ఇస్తున్నారు. నేను మీ సమస్యలను ప్రస్తావించినప్పుడల్లా మీరు నాకు మద్దతు ఇస్తారు. నన్ను ప్రశంసిస్తారు. ప్రోత్సహిస్తారు. మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇలాగే నా చేయి పట్టుకుని నాకు మద్దతు ఇస్తూ ఉండండి. వదిలిపెట్టకండి. నేను మీకు చెందినవాడిని. మీ కోసమే ఉన్నాను. ఈరోజు పార్లమెంటులో మాట్లాడే నా హక్కును లాక్కుని, నా గొంతు నొక్కేసిన వారికి కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.’’ అని రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు

ప్రస్తుతం రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. అయితే ఇటీవల లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిర్ధోషులుగా విడుదలయ్యారు. ఆ సమయంలో రాఘవ్ చద్దా ఒక్క మాట కూడా బహిరంగంగా మాట్లాడలేదు. కనీసం మద్దతుగా కూడా నిలవలేదు. అంతేకాకుండా బీజేపీకి దగ్గరవుతున్నారన్న వార్తలు రావడంతో ఈ వేటు పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.