Reading Time: < 1 minute
Khawaja Asif Slams Indias Operation Sindhu Remarks Tensions Rise Ahead Of Pahalgam Attack Anniversary

Pakistan: గతేడాది జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్ని పాకిస్తాన్ మర్చిపోయినట్లుంది, అందుకే భారత్‌ను ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలుతోంది. గురువారం, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం నీడలో పాకిస్తాన్ భారత్‌పై కుట్ర పన్నినా, ఏదైనా దుస్సాహసానికి దిగినా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు.

Read Also: Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

ఇదిలా ఉంటే, రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. పాకిస్తాన్‌పై ఏ దాడి జరిగినా తమ ప్రతిస్పందన వేగంగా, ప్రణాళికాబద్ధంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘పహల్గామ్ దాడి వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో పదే పదే చేసే ఈ ప్రసంగాలు బలాన్ని కాదు, స్పష్టంగా వ్యూహాత్మక ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి’’ అని ఆసిఫ్ అన్నారు. ఇలాంటి బెదిరింపులు కొత్తేమీ కాదని, ఇది ఊహించిన ధోరణిలో భాగే అని అంతర్గత బలహీనతలను బయటపెట్టి, స్వప్రయోజన రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధారమైన ఆరోపణల ముసుగులో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని భారత్‌పై ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందని, కానీ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందని, తమ దాడి వేగంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని అన్నారు.

గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి ఇరు దేశాల మధ్య స్వల్ప యుద్ధానికి కారణమైంది. 25 మందిని బలిగొన్న ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి ప్రయత్నించడంతో పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వైమానిక స్థావరాలపై భారత ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. నూర్ ఖాన్, చక్లాలా, రహీంయార్ ఖాన్, సర్దోదా వంటి ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.