
బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ముందు ఒక సైనికుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. భూ మాఫియా తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సహదేశ్ కుమార్.. భారత సైన్యంలో సైనికుడు. బీహార్లోని ఛప్రా నగరంలో భిఖారీ ఠాకూర్ ఆడిటోరియంలో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. వేదికపైకి సైనికుడు సహదేశ్ కుమార్ వచ్చి డిప్యూటీ సీఎం ముందు తన గోడు వెళ్లబుచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
తమ కుటుంబం భూ మాఫియా కారణంగాతీవ్ర ఇబ్బందులకు గురవుతోందని.. భూ వివాదం కారణంగా తన తండ్రి మరణించారని, ఇప్పుడు తన మామ బ్రెయిన్ హెమరేజ్కు గురయ్యారని చెప్పాడు. తాను మాఫియాతో పోరాడలేకపోతున్నానని.. ఎంత నిస్సహాయంగా ఉన్నానంటే ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచిస్తున్నానని తెలిపాడు. ‘‘నాకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వాళ్లకి పెళ్లి ఎలా చేయాలి? నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్?. న్యాయం జరగకపోతే అదే శరణ్యం.. మేము కోర్టుకు వెళ్లే స్థితిలో లేము. మేము పని చేయాలా లేక కోర్టుకు వెళ్లాలా? సార్?.’’ అడిగాడు.
భావోద్వేగానికి గురవుతున్న సైనికుడిని ఉప ముఖ్యమంత్రి శాంతింపజేశారు. ఆత్మహత్య పిరికితనమని అన్నారు. ‘‘నువ్వు వెళ్లిపోతే నీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు ఇతరులను కాపాడితే.. నీకు న్యాయం జరుగుతుంది. మనం నేరస్థులకు భయపడితే.. వారు మనపై దాడి చేస్తారని నేను అందరికీ చెబుతాను.’’ అని అన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా.. ఈ విషయాన్ని పరిశీలించి, భూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టంగా తెలిపారు. అటువంటి వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసి, భూమిని విడిపించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
ఇది కూడా చదవండి: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు