Reading Time: < 1 minute
Dharmendra Pradhan: జ్యుడీషియల్‌ అధికారుల నిర్బంధంపై సీరియస్‌.! మమత ప్రభుత్వంపై ధర్మేంద్ర ప్రధాన్ ఘాటు వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో న్యాయాధికారులను బందీలుగా పట్టుకున్న ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ మమతా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..! మాల్దా జిల్లాలో చోటుచేసుకున్న ఒక అవాంఛనీయ సంఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. ఒక భూ వివాదం పరిశీలన కోసం వెళ్లిన జ్యుడీషియల్ అధికారులను గ్రామస్థులు బందీలుగా పట్టుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.

అసలేం జరిగింది?

మాల్దాలో కోర్టు ఆదేశాల మేరకు భూమిని సర్వే చేయడానికి వెళ్లిన ముగ్గురు జ్యుడీషియల్ అధికారులను, కొంతమంది స్థానికులు ఒక గదిలో నిర్బంధించారు. సుమారు 9 గంటలుపైగానే వారిని బందీలుగా ఉంచడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరకు భారీ పోలీస్ బందోబస్తుతో వారిని విడిపించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో సామాన్యులకే కాదు, చివరకు న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అరాచకత్వానికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు.