Reading Time: 2 minutes
Hyderabad: భార్యను కాదని.. వేరే మహిళను పెళ్లి చేసుకున్న భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్‌లో చోటుచేసుకున్న తల్లి, ఇద్దరు చిన్నారుల మృతి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులకు ఉరేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా స్రవంతి భర్త ప్రవీణ్ రెండో వివాహమే ఈ దారుణానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. స్రవంతికి చెల్లెలు వరుసయ్యే మహేశ్వరిని పెళ్లి చేసుకోవడంతో స్రవంతి తీవ్ర మనస్థాపానికి లోనైంది. భార్యపై మానసిక, భావోద్వేగ వేధింపులు పెరిగిన నేపథ్యంలో స్రవంతి తీవ్ర ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కుటుంబంలో నెలకొన్న విభేదాలు, నిరంతర వేధింపులే ఆమెను ఆత్మహత్య దిశగా నెట్టాయని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త ప్రవీణ్‌తో పాటు అతని రెండో భార్య మహేశ్వరి, తల్లిదండ్రులు మణెమ్మ, శంకర్, అలాగే అతని మిత్రుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ రెండో వివాహానికి కుటుంబ సభ్యులు, మిత్రుడు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని రిమాండ్‌కు తరలించింది. ఈ ఘటనతో కుటుంబ వేధింపుల తీవ్రత, దాని దుష్పరిణామాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసును మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషాద ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. కుటుంబ సమస్యలు ఇంతటి ఘోర పరిణామాలకు దారితీయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా.. స్రవంతి భర్త ప్రవీణ్ ఇంట్లోనే ఇద్దరు కుమారుల అంత్యక్రియలు నిర్వహించారు.. అక్కడే గుంత తీసి దానం చేశారు. వారికి సంబందించిన పొలంలో స్రవంతి అంత్యక్రియలు జరిగాయి. దీంతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని బోడమాణిక్యంతండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనతో మహిళలపై జరుగుతున్న మానసిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. స్రవంతిపై గతంలోనూ వేధింపులు జరిగాయా? ఆమె ఎవరైనా వద్ద ఫిర్యాదు చేసిందా? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..