Reading Time: 2 minutes
Iran Us War Iran President Pezeshkian Questions Us After Officials Wife Killed

ప్రపంచ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ పలు ప్రశ్నలు సంధించారు. ఒక అమాయక ఇరాన్ అధికారి భార్యను చంపడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా పెజెష్కియన్ నిలదీశారు. ఈ ఘటనపై ప్రపంచమే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఇలా చేస్తే దౌత్యం ఎలా జరుగుతుంది? అని అనుమానం వ్యక్తం చేశారు.

‘‘నేను అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే మా వ్యూహాత్మక విదేశీ విధాన మండలి ప్రధానుడి కుటుంబం హత్యాయత్నానికి గురైంది. ఈ దాడిలో ఆయన అమాయక భార్య మృతిచెందింది. దీనిపై ప్రపంచమే తీర్పు చేయాలి. సంభాషణ, చర్చలకు పాల్పడేది ఏ వైపు.. ఉగ్రవాదానికి దిగేది ఏ వైపు?.’’ ప్రపంచమే గమనించాలని పెజెష్కియన్ కోరారు.

ఈ ఘటనను అంతర్జాతీయ సంబంధాలతో పెజెష్కియన్ ముడి పెట్టారు. ఎవరు శాంతిపరులో.. ఎవరు వైరుద్యాన్ని సృష్టిస్తున్నారో గమనించాలని కోరారు. అమెరికా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ దాడి జరగడం ఏ మాత్రం భావ్యం అని అడిగారు. ఇది నిర్మాణాత్మక సంప్రదింపులకు సాధ్యమవుతుందా? అని వ్యాఖ్యానించారు. కాబట్టి రెండు దేశాల వైఖరిని ప్రపంచ దేశాలు అంచనా వేయాలని కోరారు. ఈ ఘటనపై మాత్రం ప్రపంచ దేశాలే తీర్పు చెప్పాలని డిమాండ్ చేశారు.

గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.

ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.